Guntur: మొబైల్‌కు ట్రాఫిక్ చలానా పడిందని మెసేజ్.. ఓపెన్ చేయగానే..

బీ అలెర్ట్.. సైబర్ రేరగాళ్లు మరో కొత్త క్రైమ్‌కు తెరలేపారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో మోసానికి తెగబడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని ఇలానే బోల్తా కొట్టించారు. అందుకే అనుమానాస్పద మెసేజ్‌లు అస్సలు క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Guntur: మొబైల్‌కు ట్రాఫిక్ చలానా పడిందని మెసేజ్.. ఓపెన్ చేయగానే..
Traffic Challan

Edited By: Ram Naramaneni

Updated on: Aug 24, 2025 | 12:19 PM

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంకు చెందిన నిరంజన్ రెడ్డి హోటల్ నిర్వహిస్తుంటాడు. సాధారణంగా నిరంజన్ రెడ్డి బైక్ పై వివిధ ప్రాంతాలకు వెలుతుంటాడు. శుక్రవారం సాయంత్రం ఆయన సెల్ ఫోన్ కు ఒక మెసెజ్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయన వాహనంపై చలానా ఉందని ఏపికే ఫైల్ మెసేజ్ వచ్చింది. దాన్ని చెల్లించడానికి లింక్ పంపినట్లు అందులో పేర్కొన్నారు. అయితే లింక్ ఓపెన్ చేసిన నిరంజన్ రెడ్డికి ఒక యాప్ వచ్చింది. యాప్ లో ఓటిపి చెప్పాలని అడగడం జరిగింది. దీంతో అనుమానం వచ్చిన నిరంజన్ రెడ్డి ఇక అక్కడితో ముందుకెళ్లడం ఆపేశారు. అయితే తర్వాత రోజు ఉదయం ఆయన క్రెడిట్ కార్డు నుండి ఒకసారి 61 వేలు, మరొసారి 32 వేలు డబ్బులు డ్రా చేసినట్లు మెసేజ్ లు వచ్చాయి. దీంతో నిరంజన్ రెడ్డి అప్రమత్తమై వెంటనే కార్డును బ్లాక్ చేయించారు.

కార్డును బ్లాక్ చేయించే లోపే మరో 20999 డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. ఆ డబ్బుతో సెల్ ఫోన్ కొనుగోలు చేసినట్లు సందేశం వచ్చింది. ఇలా మొత్తం మీద లక్షన్నర వరకూ డ్రా చేశారు. అయితే క్రెడిట్ నుండి మొదట డబ్బులు డ్రా చేసే సమయం నుండి కార్డు బ్లాక్ చేసే వరకూ ఆయన సెల్ ఫోన్ కు 2000ల మెసేజ్ లు వచ్చాయి. డబ్బులు డ్రా చేసుకుంటున్న విషయం తెలియకుండా ఉండేందుకే బల్క్ మెసేజ్ లు పంపినట్లు తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి వెంటనే డబ్బులు డ్రా చేసుకున్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు మహరాష్ట్రకు చెందిన వ్యక్తి డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతి కోరారు. త్వరలోనే సైబర్ క్రైంకు పాల్పడిన నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.