
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరిన్ని సేవలు అందించేందుకు సిద్దమైంది. తిరుమల శ్రీవారి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాన్ని టీటీడీ ఇప్పటికే కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరుమలలోని కళ్యాణ మండపంలో ఉచితంగా పెళ్లి చేసుకోవడంతో పాటు వధూవరులకు ఫ్రీ దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి తిరుమలలో శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. తిరుమలలోని శ్రీవారి కల్యాణ వేదిక వద్ద టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. కొంత మొత్తంలో రుసుం చెల్లించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇవి అతి తక్కుక ధరలే ఉంటాయి. పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు.
ఇక తిరుమలలో వాహన పూజ కూడా చేయించుకోవచ్చు. తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద ఉండే పురోహిత సంఘం ఆధ్వర్యంలో వివిధ రకాల పూజలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. వాహన పూజతో పాటు సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం వంటి రకరకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇక ఇక్కడ వివాహం కూడా చేసుకోవచ్చు. ఈ పూజలు చేయించుకునేందుకు ఫీజులు వసూలు చేస్తారు. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల కొండపై వివిధ రకాల పూజలు చేయించుకోవాలనే భక్తులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. పురోహిత సంఘాన్ని ఆశ్రయించి ఈ పూజలకు సంబంధించిన సేవలు పొందాల్సి ఉంటుంది.
-ఉపనయనం ఫీజు రూ.300
-సత్యనారాయణ వ్రతం పూజ-300
-నామకరణ కార్యక్రమం-200
-అన్నప్రాసన కార్యక్రమం-200
-అక్షరాభ్యాసం-200
-వాహన పూజ-200
-కేశఖండన-200
-దస్త్ర పూజ-200
-చెవిపొగులు కుట్టడం-50
-మేళం సింగిల్ సెట్టు-100
-రెండు సెట్ల మేళం-300
-ఇతర ధార్మిక పూజలు-200
-వివాహం ఉచితంగా చేస్తారు