మరో 3 నెలల్లో ‘నో హరన్’ జోన్గా.. తిరుమల- తిరుపతి ఎస్పీ
తిరుమల పుణ్యక్షేత్రాన్ని నో హరన్ జోన్గా చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి. శుక్రవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు.
తిరుమల పుణ్యక్షేత్రాన్ని నో హరన్ జోన్గా చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి. శుక్రవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ వచ్చే మూడునెలల్లో ఘాట్ రోడ్ లో అతివేగం, హారన్ మోగించడం, స్పీడ్ లిమిట్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
తిరుమల కొండకు చేరుకున్న భక్తులు పాదరక్షలు పక్కన పెట్టి ఎలా నడుస్తారో.. అలాగే.. వాహనదారులు కూడా హరన్లు వినియోగించకూడదని ఆదేశాలు జారీ కాబోతున్నాయి. దేశ, విదేశాల నుండి ఇక్కడికి కోట్లాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. హారన్ల జోరు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో భక్తులు కూడా ఇబ్బందులు పడతున్నారని చెప్పారు.
తిరుమల ఘాట్ రోడ్లలో జంతువులు కూడా తిరుగుతున్న నేపథ్యంలో భక్తులు తమ వాహనాలు తక్కువ వేగంతో నడపాలని కోరారు. బయట దేశాల్లో ఎదుటవారు తప్పు చేస్తేనే హారన్ లు మోగిస్తారని తెలిపారు. తిరుమలలో గోవిందనామస్మరణ తప్ప వాహనశబ్దాలు లేకుండా చేయడానికి కృషి చేస్తామన్నారు. 2010 ముందు కంటే రిజిస్ట్రేషన్ అయిన వాహనాల అనుమతిపై ట్రాన్స్ పోర్ట్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. నో హారన్ విధానం అలవాటు అయితే… హారన్ వినియోగించకుండా.. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని అధికారుల నమ్మకం.