
ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. పిల్లల చదువులు తల్లిదండ్రులు భారం కాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు ఈ సొమ్ము అందిస్తోంది. పిల్లలను చదివించాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంతో కూడుకున్న పని. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.15 వేల ఆర్ధిక సహాయం అందిస్తోంది. గత ఏడాది వీటిని జమ చేయగా.. ఈ ఏడాదికి సంబంధించిన సొమ్ము ఈ నెలలో తల్లిదండ్రుల ఖాతాల్లో వేయనుంది. జులై 15వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులు లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ నిధులు పడాలంటే తప్పనిసరిగా కొన్ని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది.
తల్లికి వందనం పథకం కింద డబ్బులు పడాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ చేసుకుని ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసి ఉండాలి. బ్యాంక్కు వెళ్లి ఈ రెండు పనులు పూర్తి చేయవచ్చు. ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేస్తేనే అకౌంట్లో నగదు డీబీటీ ప్రక్రియ ద్వారా జమ అవుతాయి. ఒకవేళ చేసుకోకపోతే డబ్బులు నిలిచిపోతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది కూడా ఎన్పీసీఐ మ్యాపింగ్ చేసుకోకపోవడంతో చాలామంది లబ్దిదారులు డబ్బులు పడలేదు. దీంతో బ్యాంక్కు వెళ్లి ఎన్పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. దీని వల్ల నగదు పొందటంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. ఇందుకోసం ప్రతీ ఏడాది ఒక్కసారైనా కేవైసీ పూర్తి చేయాలి. ప్రభుత్వ పథకాల సొమ్ము కేవైసీ ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపుల ద్వారా నేరుగా అకౌంట్లో పడతాయి. దీంతో కేవైసీ చేసుకుంటేనే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
గత నెలలో ఏపీలో స్కూల్స్, కాలేజీలు ప్రారంభమయ్యాయి. అయితే గత నెలలోనే ఈ సొమ్మును అందించాల్సి ఉండగా.. లబ్దిదారుల ఎంపిక, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ జరుగుతోంది. దీంతో ఆ రోజు నుంచి తల్లికి వందనం నిధులను తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్దిదారుల జాబితాను సిద్దం చేసి ప్రభుత్వం విడుదల చేసింది.