తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనాల విషయంలో దేవస్థానం కీలక మార్పులు చేసింది. టీటీడీ తరహాలో వీవీఐపీలు ఇచ్చే సిఫారసు లేఖల ఆధారంగా ప్రోటోకాల్ దర్శనాలను కల్పించే విధానాన్ని ఈరోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రోజుకు ఒక్క లేఖ చొప్పున గరిష్ఠంగా ఆరుగురి పేర్లను సిఫారసు చేయవచ్చు.

తిరుమల తరహాలో శ్రీశైలంలో VVIPల లెటర్స్‌తో భక్తులకు స్పర్శ దర్శనాలు
Srisailam Temple

Edited By:

Updated on: Aug 15, 2026 | 1:38 PM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనాల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా ప్రోటోకాల్ దర్శనాలను అందించేందుకు టీటీడీ తరహాలో వీఐపీలు ఇచ్చే సిఫారసు లేఖల ఆధారంగా దర్శనాలు కల్పించే విధానాన్ని శ్రీశైల దేవస్థానం తొలిసారిగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ఆగస్టు 15, శనివారం నుంచే అమలులోకి వచ్చింది.

ఇకపై ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తదితర అర్హత కలిగిన వీవీఐపీలు భక్తులకు ప్రోటోకాల్ దర్శనం కోసం సిఫారసు లేఖలు ఇవ్వవచ్చు. అయితే ఒక్కో వీవీఐపీ రోజుకు ఒక్క లేఖ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో లేఖలో గరిష్ఠంగా ఆరుగురి పేర్లను మాత్రమే నమోదు చేసే అవకాశం కల్పించారు.

మూడు రోజులు.. సామాన్య భక్తులకే ప్రాధాన్యం

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శని, ఆది, సోమవారాల్లో ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ మూడు రోజుల్లో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం స్పర్శ దర్శనాలను మూడు షిఫ్టులుగా నిర్వహించనున్నారు. వీవీఐపీలు ఇచ్చే సిఫారసు లేఖల ఆధారంగా భక్తులకు ఈ దర్శన సౌకర్యాన్ని కల్పిస్తారు.

ఒక్కొక్కరికి రూ.500 రుసుము

వీఐపీ సిఫారసు లేఖతో ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసేందుకు సిఫారసు లేఖలను ముందుగానే పంపించాల్సి ఉంటుంది. వీఐపీ లేఖలను దర్శనం తేదీకి 48 గంటలలోపు శ్రీశైల దేవస్థానం అధికారిక వాట్సాప్ నంబర్ 91600 16215కు లేదా protocol@srisailamdevasthanam.orgకు పంపించవచ్చు. లేఖ అందిన తర్వాత భక్తుల రద్దీ, దర్శన సమయాలు, ప్రాధాన్యత తదితర అంశాలను పరిశీలించి దేవస్థానం అధికారులు అనుమతులు జారీ చేస్తారు.

అవసరమైతే వసతి కూడా

ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే భక్తులకు అవసరాన్ని బట్టి వసతి సౌకర్యాన్ని కూడా కల్పించే అవకాశం దేవస్థానం కల్పించింది. అయితే వసతి విషయంలో అందుబాటులో ఉన్న గదులు, రద్దీ, ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు.

ఇతర రాష్ట్రాల వీవీఐపీలకు కూడా అవకాశం

ఈ కొత్త విధానం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకే పరిమితం కాదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వీవీఐపీలు కూడా సిఫారసు లేఖలు ఇచ్చే అవకాశం కల్పించారు. అయితే శ్రీశైలంలో భక్తుల రద్దీ, ప్రాధాన్యత, దర్శనాల పరిస్థితులను బట్టి ఆయా లేఖలను పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నారు.

భక్తుల రద్దీ.. ప్రోటోకాల్ మధ్య సమతుల్యం

శ్రీశైల క్షేత్రంలో ముఖ్యంగా వారాంతాలు, పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వీవీఐపీ సిఫారసు లేఖల పేరుతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రోజులలో దర్శన సమయాలను పరిమితం చేయడం ఈ కొత్త విధానంలో కీలక అంశంగా కనిపిస్తోంది.

టీటీడీ తరహాలో సిఫారసు లేఖలను ముందుగానే స్వీకరించి, భక్తుల వివరాలను నమోదు చేసి, రద్దీకి అనుగుణంగా దర్శనాలను కేటాయించడం ద్వారా ప్రోటోకాల్ దర్శనాల నిర్వహణలో మరింత క్రమబద్ధత తీసుకురావడమే లక్ష్యంగా దేవస్థానం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

శ్రీశైలంలో తొలిసారిగా అమల్లోకి వచ్చిన ఈ వీఐపీ సిఫారసు లేఖల ఆధారిత ప్రోటోకాల్ దర్శన విధానం.. వీఐపీలకు సౌకర్యం కల్పించడంతో పాటు సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా సమతుల్యం సాధించేలా రూపొందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us