
మధ్యాహ్నం 12 గంటల సమయం.. ఆ గ్రామంలోని రైతులు పనుల్లో ఉన్నారు. ఇంతలో సమీప పంట కాలువలో నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. మొదట వాటిని లైట్ తీసుకున్నప్పటికీ.. మనిషి ఈల వేసినట్టుగా శబ్దం ఉండటంతో అక్కడ ఉన్నవారికి కొంత అనుమానం వచ్చింది. ఏంటా శబ్దం అని కాలువ దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఉన్న గడ్డి నెమ్మదిగా కదులుతోంది. మరింత పరిశీలనగా చూసేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అక్కడి వారంతా. దాంతో గట్టు పైకి పరుగులు తీశారు. ఇంతకీ వారు అంతగా పరుగులు పెట్టడానికి కారణం ఎంటా అంటే ఆ కాలువలో ఉన్నది భారీ కొండ చిలువ. శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. పంట కాలువలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న స్థానిక రైతులకు అది దర్శనమిచ్చింది. కొండ చిలువను చూసిన స్థానికులు ,రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంత భారీ కొండ చిలువను తామేప్పుడు చూడలేదని ఆశ్చర్య పోయారు.
స్థానికులు ద్వారా సమాచారమందుకున్న పలాస ఫారెస్ట్ రేంజర్ మురళి కృష్ణం నాయుడు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్నేక్ క్యాచర్ను రప్పించి రంగంలోకి దింపారు. ఎట్టకేలకు ఆ భారీ కొండ చిలువను చాలా చాకచక్యంగా పట్టుకొని బంధించారు స్నేక్ క్యాచర్. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సమీప కొండల్లోగల అటవీప్రాంతంలో కొండచిలువను విడిచిపెట్టారు. సుమారు 13 అడుగుల పొడవు ఉంది కొండచిలువ. ఇది మహేంద్ర గిరి కొండలనుండి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ట్టకేలకు పట్టుబడిన ఆ కొండచిలువను ఎవరికీ హాని కలగకుండా సమీప కొండల్లోని దట్టమైన అటవీప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.