AP Panchayat Elections 2021 : పడతికి పట్టం కట్టిన పల్లె.. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు అందరూ అతివలే.. ఇదెక్కడంటే..!

ఏకగ్రీవం కోసం ముందుకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. దీంతో కడప జిల్లాలో ఓ గ్రామం వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు మహిళలకే పట్టం కట్టింది.

AP Panchayat Elections 2021 : పడతికి పట్టం కట్టిన పల్లె.. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు అందరూ అతివలే.. ఇదెక్కడంటే..!

Updated on: Feb 09, 2021 | 2:05 PM

All ward members women :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండున్నరేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు పోలింగ్ ఇవాళ మొదలైంది. వివిధ కారణాలతో పంచాయతీల పాలకవర్గాలు లేకుండా సాగిపోయిన ఆంధ్రప్రదేశ్ లో విభజనానంతరం తొలి ఎన్నికలకు ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.

గ్రామీణ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణ మీద తీవ్ర సందిగ్ధత తర్వాత ప్రస్తుతం పోటీ చేసే ఆశావాహుల సందడి ఎక్కువగానే ఉంది. మరోవైపు ఏకగ్రీవాల కోసం అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఏకగ్రీవం కోసం ముందుకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. దీంతో కడప జిల్లాలో ఓ గ్రామం వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు మహిళలకే పట్టం కట్టింది.

కడప జిల్లా చిట్వేలి మండలంలోని నక్కలపల్లె పంచాయతీ ఏకగ్రీవం కాబోతోంది. కొత్త పాలకవర్గంలో సర్పంచ్, వార్డు సభ్యులందరూ మహిళలే కొలువుదీరబోతున్నారు. నక్కలపల్లె పంచాయతీ పరిధిలో 8 పల్లెలు ఉన్నాయి. గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,077 మంది ఓటర్లు ఉన్నారు. అయితే,ఈసారి సర్పంచ్ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేయగా.. గ్రామపెద్దలు సర్పంచ్ సహా 8 వార్డులకూ ఒక్కొక్కరు చొప్పున మహిళలనే అభ్యర్థులుగా ప్రతిపాదించారు. ఎక్కడా పోటీలేకుండా గ్రామస్తుల అందరి సమక్షంలో తీర్మానించుకున్నారు.

దీంతో సర్పంచ్‌గా మద్దిన రామసుబ్బమ్మ (65) ఎన్నిక లాంఛనం కానుంది. గతంలోనూ ఆమె ఓ దఫా గ్రామ సర్పంచ్ పదవి చేపట్టారు. గ్రామంలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించడమే తమలక్ష్యం అంటున్నారు అభ్యర్థులు. ఏకగ్రీవంతో వచ్చే అదనపు నిధులతో గ్రామాన్ని మరింత బాగు చేసుకుంటామంటున్నారు.

Read Also… AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ఎన్నికల ‘తొలి’ పోరు.. మధ్యాహ్నం 12.30 వరకు 62శాతం పోలింగ్