
పెళ్లి అన్న తరువాత విందులు, వివాదాలు, అలకలు, బుజ్జుగింపులు సరదాగా ఉన్నంత వరకు పర్వాలేదు… చిన్న చిన్న కారణాలతో చెలరేగిన వివాదాలు ఘర్షణలు, దాడుల వరకు వెళితేనే అసలు సమస్య జఠిలమవుతుంది.. ఇలాంటి ఘటనే ఒకటి మార్కాపురంజిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి విందు జరుగుతుండగా సాంబారులో ఉప్పు తక్కువైందన్న కారణంగా వధువు, వరుడు బంధువులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో వధువు, వరుడు బిత్తరపోయారు. మూడుముళ్ల బంధం కోటి ఆశలతో వేదమంత్రాల మధ్య ఒక్కటవుతుంటే సాంబారులో ఉప్పు తక్కువైందన్న కారణంగా ఇరువైపులా బంధువులు కొట్టుకోవడంతో పెళ్లి పరివారం ఆందోళనకు గురైంది.
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలు హింసాత్మకంగా మారాయి. సాంబారులో ఉప్పు తక్కువైందని వధువు తరుపు బంధువులు గొడవపడ్డారు. తగాదా చిలికి చిలికి పెద్దది కావడంతో రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉండగా వీరి తలలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
బురుజుపల్లికు చెందిన వరుడికి అదే గ్రామానికి చెందిన వధువుతో వివాహం జరిగింది. భోజనాలు వడ్డిస్తుండగా సాంబారులో ఉప్పు తక్కువైందని గ్రహించారు. పక్కనే ఉన్న ఉప్పు గిన్నెలో స్పూను లేకపోడంతో చేతితో ఉప్పు కలుపుతున్నారన్న కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సాంబారులో ఉప్పు తక్కువైందని, అవసరం ఉన్న వాళ్ళు ఉప్పు వేసుకునేందుకు గిన్నెలో స్పూన్ పెట్టాలని కోరారు. ఈ విషయంలో పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె బంధువులు ఘర్షణ పడి రాళ్లతో దాడిచేసుకున్నారు. ఈ దాడిలో ఓ మహిళ, ఇద్దరు వ్యక్తుల తలకు గాయాలయ్యాయి… గాయపడని వారిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.