
కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో కడప – చెన్నై ప్రధాన రహదారిపై పుష్ప సినిమా స్టైల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయారు. క్యాబేజీ మాటున ఎర్రచందనం దుంగలు ఉంచి అతి చాకచకంగా బార్డర్ దాటించడానికి ప్రయత్నించారు. అయితే అటవీ అధికారులు వారి ఆట కట్టించారు. అక్రమ రవాణా చేస్తున్న 84 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు.
ప్రధాన రహదారిపై ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక మినీ లారీని అటవీ అధికారులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా.. ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. భాకరాపేట చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా అతివేగంగా వెళ్లిపోవడంతో వాహనాన్ని అటవీ అధికారులు వెంబడించారు. సినిమా స్టైల్లో స్మగ్లర్ల లారీని అటవీ అధికారులు వెంబడించారు. అటవీ అధికారులు వెంబడిస్తున్నారని తెలుసుకున్న స్మగ్లర్లు కడప శివార్లలో లారీని వదిలి పరారయ్యారు. ఎట్టకేలకు అటవీ అధికారులు చేజింగ్లో సక్సెస్ అయ్యారు. క్యాబేజీ మాటున లారీలో తరలిస్తున్న 84 ఎర్రచందనం దుంగలను, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు 2.25 టన్నులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రెండు కోట్ల పైనే ఉంటుందని అంచనా.
ఈ సందర్భంగా కడప డిఎఫ్ వినీత్ కుమార్ ఒంటిమిట్ట అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామన్నారు. 84 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మినీ లారీలో స్మగ్లర్లు వదిలేసిన మొబైల్ ఫోన్లు ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో పరారైన పీలేరు జిల్లా రేగళ్లకు చెందిన మురళి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు. యువత ఎర్రచందనం అక్రమ రవాణాలో చిక్కుకొని విలువైన జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలని ఆయన సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..