
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం ఓ మహిళ బావిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, పోలీసుల తక్షణమే స్పందించారు. ఒక కానిస్టేబుల్ సాహసంతో ఆ మహిళ సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది.
బాధితురాలు మొదట ‘112’ అత్యవసర నంబర్కు ఫోన్ చేసి, తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది. దీంతో అప్రమత్తమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెంటనే స్థానిక చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఘటనా స్థలాన్ని గుర్తించిన పోలీసులు క్షణాల్లో శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్న బావి వద్దకు చేరుకున్నారు.
హెడ్ కానిస్టేబుల్ చలపతి సాహసం
పోలీసులు వెళ్లేసరికి మహిళ బావిలోని నీటిలో మునిగిపోతూ ప్రాణాపాయ స్థితిలో ఉంది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన హెడ్ కానిస్టేబుల్ చలపతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టి వెంటనే బావిలోకి దూకారు. నీటిలో కొట్టుమిట్టాడుతున్న మహిళను చాకచక్యంగా పట్టుకుని, స్థానికులు, తోటి పోలీసుల సాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీశారు.
ప్రస్తుతం ఆ మహిళకు ప్రాథమిక చికిత్స అందించి చంద్రగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలా లేక మరేదైనా ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టిన హెడ్ కానిస్టేబుల్ చలపతితో పాటు చంద్రగిరి పోలీసుల సిబ్బందిని స్థానికులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..