
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ నూతన బార్ పాలసీని ప్రకటించింది. కొత్త పాలసీ సెప్టెంబరు 1, 2025 నుంచి అమలులోకి రానుంది. 3 సంవత్సరాల కాలపరిమితితో ఈ లైసెన్సులు 31 ఆగస్టు 2028 వరకు చెల్లుబాటు అవుతాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. అదనంగా గీత కులాలకు ప్రత్యేకంగా 84 బార్లు కేటాయించనుంది. ఈ కోటా స్టార్ హోటల్స్, మైక్రోబ్రూవరీస్, ఎయిర్పోర్ట్ బార్లకు వర్తించదు. కొత్త పాలసీలో ప్రధానంగా పారదర్శకత, సామాజిక సమతుల్యత, ఆదాయ పెంపు లక్ష్యాలుగా ఎక్సైజ్ శాఖ చెప్పింది. ఎంపిక మొత్తం లాటరీ పద్ధతిలోనే జరగనుంది. ఒకరు ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు. అయితే ఒక బార్కు కనీసం నాలుగు అప్లికేషన్లు రావాల్సిందే. కొత్త పాలసీలో గీత కులాలకు 84 బార్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. వీటి కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారు. ఈ కేటాయింపులు ఏ4 మద్యం దుకాణాల రిజర్వేషన్ పద్ధతిలోనే జరుగుతాయి. ఈ బార్లకు లైసెన్స్ ఫీజు, ఓపెన్ కేటగిరీ రేటుకి 50% మాత్రమే.
* 50,000 జనాభా వరకు ₹35 లక్షలు
* 50,001 నుంచి 5 లక్షల జనాభా వరకు ₹55 లక్షలు
* 5 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో ₹75 లక్షలు
ఈ ఫీజులు ప్రతి సంవత్సరం 10% పెరుగుతాయి. గీత కులాల బార్లకు ఈ రేట్లలో సగం మాత్రమే వసూలు చేస్తారు. ఏడాదికి 6 విడతల్లో పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ సమయంలో ఒక విడత మొత్తానికి సమానమైన బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. బార్లు మునిసిపల్ పట్టణాలు, వాటి బెల్ట్ ఏరియాలు, పర్యాటక కేంద్రాల్లో మాత్రమే ఏర్పాటు చేయవచ్చు. మతపరమైన పర్యాటక కేంద్రాల్లో మాత్రం బార్లకు అనుమతి లేదు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు వంటి ప్రదేశాల దూర నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. భవిష్యత్తులో యూడీఏ, ఎంఢీఏ ప్రాంతాలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఎస్ఈజెడ్లలో కూడా అనుమతులు ఇవ్వొచ్చు.