Nellore: చొల్లంగి అమావాస్య.. పెన్నా నదిలో కనిపించిన ఆ దృశ్యం చూసి వెన్నులో వణుకు

|

Feb 10, 2024 | 9:44 PM

నెల్లూరు జిల్లాలో మరోసారి క్షుద్రపూజలు కలకలం రేపాయి. పెన్నా నదిలో క్షుద్రపూజలు చేశారు దుండగులు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పుర్రెలతో పూజలు చేయడంపై ఫైరవుతున్నారు. వారు చేసే పూజలతో తమకు కీడు జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు.

Nellore: చొల్లంగి అమావాస్య.. పెన్నా నదిలో కనిపించిన ఆ దృశ్యం చూసి వెన్నులో వణుకు
Black Magic (Representative image)
Follow us on

కాలం మారినా.. టెక్నాలజీ పెరిగినా.. ప్రభుత్వాలు హెచ్చరించినా.. జనవిజ్ఞాన వేదికలు అవగాహన కల్పించినా కొందరు మూఢనమ్మకాలను వీడడం లేదు. క్షుద్రపూజల పేరుతో ఏదో సాధిస్తామని భ్రమలో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యం బాగుపడుతుందని కొందరు.. ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తూ ఇంకొందరు.. క్షుద్రపూజలకు తెగబడుతూనే ఉన్నారు. తెలుగురాష్ట్రాల్లో నిత్యం ఏదో ఓ చోట క్షుద్రపూజలు కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా  నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేపాయి. బుచ్చి మండలం దామరమడుగు పల్లిపాలెం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. చొల్లంగి అమావాస్య నేపథ్యంలో పెన్నా నదిలో క్షుద్రపూజలు జరిపారు. ఉదయం నది దగ్గరకు వెళ్లిన గ్రామస్థులు క్షుద్రపూజల బొమ్మలను చూసి భయాందోళన చెందుతున్నారు.

గతంలోనూ పల్లిపాలెం శివారులో క్షుద్ర పూజలు చేసినట్లు చెబుతున్నారు గ్రామస్థులు. అమావాస్య వచ్చిందంటే ఏదో ఒక చోట క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్షుద్రపూజల వల్ల ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో ఉన్నారు దామరమడుగు పల్లి పాలెం గ్రామస్థులు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని.. గుట్టుచప్పుడు కాకుండా క్షుద్రపూజలు నిర్వహించే దుండగుల ఆటకట్టించాలని వేడుకుంటున్నారు గ్రామస్థులు.

మూఢనమ్మకాలను నమ్మోద్దని గ్రామస్థులకు సూచించారు పోలీసులు. గతంలో కూడా ఇక్కడ క్షుద్ర పూజలు చేశారని పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండ ఉండేలా.. నిఘా పెంచుతామని గ్రామస్థులకు ధైర్యం చెప్పారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…