
అనంతపురం నగరంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగుచూసింది. కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే కత్తెరతో దారుణంగా పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగరానికి చెందిన సురేంద్ర (28) అనే యువకుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ, మద్యం తాగడం కోసం డబ్బులు కావాలంటూ నిత్యం తల్లి సునీతను వేధించేవాడు. రోజురోజుకూ సురేంద్ర పెట్టే చిత్రహింసలు, మానసిక వేధింపులు ఎక్కువయ్యాయి.
ఎప్పటిలాగే నిన్న కూడా కొడుకు గొడవ పడటంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. విసిగిపోయిన తల్లి సునీత.. ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన తల్లి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వేధింపుల వల్లే ఈ హత్య జరిగిందా లేక దీని వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..