
గుంటూరు, మే 20: పదో తరగతిలో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్ధులను విమానంలో విహార యాత్రకు తీసుకెళ్తానని గుంటూరు ఎమ్మెల్యే గతంలో విద్యార్ధులతో చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం గుంటూరు అర్బన్ లోనే ఉంటుంది. ఎనిమిది మున్సిపల్ పాఠశాలల్లో 550పైగా మార్కులు సాధించిన విద్యార్ధులు 39 మంది ఉన్నట్లు గుర్తించారు. వారితో పాటు ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతో కలిపి మొత్తం 52 మందిని ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల ఢిల్లి విహార యాత్రకు తీసుకెళ్తున్నారు.
సాధారణంగా బస్సులో తీసుకెళ్లకుండా విమానం ఎక్కిస్తానని ముందుగానే ఎమ్మెల్యే మాధవి చెప్పడంతో ఫలితాలు వచ్చిన రోజు నుండి విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. వారందరిని ఈ రోజు గన్నవరం ఎయిర్ పోర్టు ను విమానంలో ఢిల్లీ తీసుకెళ్లనున్నారు. సాయంత్రం ఏడు గంటల ఫ్లైట్ లో తీసుకెళ్లి మూడు రోజుల పాటు విద్యార్ధులు, ఉపాధ్యాయులకు పర్యాటక ప్రాంతాలను చూపించనున్నారు.
అంతే కాకుండా ఉపరాష్ట్రపతితో విద్యార్ధులు కలిసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఒక రోజు డిన్నర్ ఇవ్వనున్నారు. ఇలా మొత్తం మీద అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులు రానున్న మరింత కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించేలా వారిని ప్రోత్సహించేందుకు ఈ టూర్ ను ఎమ్మెల్యే దంపతులు ప్లాన్ చేశారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులతో పాటు ఎమ్మెల్యే దంపతలుు, వారి పిల్లలు కూడా ఈ పర్యటనలో వారితే పాటు పాల్గొంటారు. ఎమ్మెల్యే చేస్తున్న ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వం ఇటు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుండటాన్ని నగర వాసులు స్వాగతిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.