
సెల్ఫీ ఫోటో సరదా ఓ నిండు ప్రాణం పోయేలా చేసింది. సెల్పీ కోసం ప్రయత్నిస్తూ.. ఓ విద్యార్థి చనిపోయిన ఘటన మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీలో చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీకి చెందిన ఏసుబాబు, జాన్ వెస్లీ, అభిరామ్ అనే ముగ్గురు చిన్నారులు.. సాయంత్రం సమయంలో సరదాగా ఫోటోలు దిగేందుకు బయటకు వెళ్లారు. రాయవరం సమీపంలోని అటవీశాఖకు చెందిన నగర వనంలో ఫొటోలు దిగారు. అక్కడినుంచి వెళ్లి పలకల క్వారీల వద్దకు వెళ్లారు. క్వారీలోకి దిగి నీళ్ల గుంత దగ్గర ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఏసుబాబు నీళ్లలో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఈతగాళ్ల సాయంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మార్కాపురం పట్టణం సమీపంలోని రాయవరంలో ప్రమాదవశాత్తు పలకల క్వారీ గుంతలో పడి 14 ఏళ్ల బాలుడు ఏసుబాబు మత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మార్కాపురం సిఐ సుబ్బారావు కథనం మేరకు.. రాయవరం పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీలో ఉంటూ 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ళ బాలుడు ఏసుబాబు అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు. తల్లిదండ్రులు హైదరాబాద్లో కూలీపనులు చేసుకుంటుండగా.. ఏసుబాబు అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. పూలసుబ్బయ్య కాలనీకే చెందిన తన ఇద్దరు స్నేహితులు జాన్వెస్లీ, బూతపాటి అభిరామ్లతో కలిసి ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం రాయవరంలోని నగరవనం పార్క్కు వెళ్ళారు. కొద్దిసేపు పార్క్లో సరదాగా గడిపి సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం సమీపంలో పలకల క్వారీ గుంతల దగ్గర నీళ్ళ దగ్గర సెల్ఫీలు తీసుకునేందుకు ఉపక్రమించారు.
ఈ క్రమంలో లోతుగా ఉన్న క్వారీ గుంత అంచు దగ్గర నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా ఏసుబాబు ప్రమాదవశాత్తూ జారి నీటి గుంతలో పడిపోయాడు. వెంటనే స్నేహితులు ఇద్దరూ పై నుంచి కేకలు వేసినా ఏసుబాబు సమాధానం ఇవ్వకపోవడంతో భయంతో ఇంటికి వెళ్ళి బంధువులకు జరిగిన విషయాన్ని చెప్పారు. వెంటనే ఏసుబాబు బంధువులు పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్వారీ గుంతలో వెతికారు. అప్పటికే చీకటి పడటంతో గజ ఈతగాళ్ళను రప్పించి నీటిలో గాలించారు. రాత్రి 8 గంటల సమయంలో ఏసుబాబు మృతదేహాం లభించింది. ఏసుబాబు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం మార్కాపురం జిజిహెచ్కు తరలించారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..