Andhra Pradesh: ఇంటి వాకిట్లో లేదా పెరట్లో పండ్లు, కూరగాయలు, పూల మొక్కలను పెంచుకుంటారు చాలామంది. కాని ఇతగాడు ఏకంగా గంజాయి మొక్కలనే పెంచేశాడు. అవి కాస్తా పెరిగి పెద్దవయి.. మంచి పక్వానికి వచ్చిన దశలో పడాల్సిన వాళ్ల కళ్లలో పడింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని.. కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో ఓ వక్తి గంజాయికి బానిసయ్యాడు. స్థానిక కపాడిపాళెంలో కొంతమంది దగ్గర గంజాయి కొనుగోలు చేసి.. గుప్పు గుప్పున లాగించి ఆకాశమార్గాల్లో విహరించేవాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ ఐడియా వచ్చింది. గంజాయి దొరకడం కష్టమైంది. దొరికినా రేటు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. దీంతో తానే గంజాయి చెట్లనే పెంచితే ఈ బాధలేవీ ఉండవు కదా.. అని ఫీలయ్యాయి. తాను కొనుక్కొచ్చిన గంజాయిలోని విత్తనాలు సెపరేట్ చేసి.. తన ఇంటి వాకిట్లో.. అలాగే ఇంటి వెనక పెరట్లో చల్లడంతో అవి మొక్కలుగా మారాయి.
అవి పెరుగుతున్న క్రమంలో.. వాసన రావడం ప్రారంభమైంది. విషయం ఆ నోట.. ఈ నోట పడి.. ఊరంతా టామ్ టామ్ అయ్యింది. చివరకు విషయం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల వద్దకు వెళ్లింది. పక్కా సమాచారంలో సెబ్ సీఐ కిషోర్ తన సిబ్బంది కలిసితో అతడి ఇంట్లో దాడులు నిర్వహించారు. గంజాయి మొక్కలను వేర్లతో సహా పెకలించి.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒకటి రెండు మొక్కలు పెంచితే.. అరెస్టు చేస్తారని తనకు తెలియదని ఆ వ్యక్తి పోలీసులకు తెలపడం కొసమెరుపు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..