
తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ యువకుడు.. ఏకంగా టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు.. తన భార్యను కాపురానికి పంపించాలని.. లేక పోతే చనిపోతానంటూ పేర్కొన్నాడు.. దీంతో స్థానికులు .. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారొచ్చి.. ఆ యువకుడితో మాట్లాడారు. ఈ షాకింగ్ ఘటన కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రేడియో టవర్ దగ్గర జరిగింది. ఆదోని పట్టణంలోని రేడియో స్టేషన్ వద్ద చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గొల్ల సురేంద్ర అనే యువకుడు రేడియో టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. తన భార్యను కాపురానికి పంపకుండా అత్తారింటి వారు తనను వేధింపులకు గురి చేస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న రెండో పట్టణ సిఐ రాజశేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని టవర్ ఎక్కిన యువకుడితో సెల్ ఫోన్లో సంప్రదింపులు జరిపి ఆ యువకుడు కిందకు దిగేలా చేశారు.
టవర్ దిగిన సురేంద్ర మాట్లాడుతూ.. తాను కర్ణాటక రాష్ట్రం బళ్లారి సమీపంలోని జిందాల్ పరిశ్రమలో హెల్పర్ గా పనిచేస్తున్నట్లు తెలిపాడు.. చిప్పగిరి మండలం నేమక్కల్ గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతి తాను ప్రేమించుకొని ఏడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నామన్నాడు. అయితే.. మూడు నెలల క్రితం తన భార్యను ఆమె తల్లిదండ్రులు పండగ కోసం ఇంటికి తీసుకెళ్లారని.. ఆ తర్వాత ఆమె మనసు మార్చారని ఆవేదన వ్యక్తంచేశాడు.. అప్పటినుండి తన భార్యను ఇంటికి పంపించకుండా ఉన్నారని, ఈ విషయంలో తాను ప్రశ్నిస్తే తన పైనే దాడికి పాల్పడుతున్నారని పేర్కొన్నాడు.
వివరాలను సేకరించిన పోలీసులు.. అనంతరం సురేంద్ర నాగేశ్వరి దంపతులతోపాటు వారి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి సురేంద్రకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..