
ప్రభుత్వ ఆసుపత్రులు అంటే కేవలం సాధారణ చికిత్సలకే పరిమితం కాదని, అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్లకు కూడా కేరాఫ్ అడ్రస్ అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు నిరూపించారు. నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన 75 ఏళ్ల సుబ్బ లక్ష్మమ్మ అనే వృద్ధురాలి కడుపు నుండి ఏకంగా 10 కిలోల బరువున్న అండాశయ కనితిని తొలగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుబ్బ లక్ష్మమ్మ గత ఆరు నెలలుగా కడుపునొప్పి, విపరీతమైన కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు. అనేక ప్రైవేట్ ఆసుపత్రులలో చూపించుకున్నా ఫలితం లేకపోవడంతో, గత నెల 22న కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిని ఆశ్రయించారు.
వైద్యులు ఆమెకు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించగా, కడుపులో 30 x 25 సెంటీమీటర్ల పరిమాణంలో ఒక భారీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. 75 ఏళ్ల వయస్సు కావడంతో ఆపరేషన్ చేయడం కొంత రిస్క్ అనిపించినా, వైద్య బృందం ధైర్యంతో ముందుకెళ్లింది. మే 1వ తేదీన డాక్టర్ నరేష్ కుమార్, సందీప్ రెడ్డి, భారతి, సంధ్య, మాలిక్, కాంచన గౌరి, లక్ష్మిలతో కూడిన బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించి ఆ 10 కిలోల కనితిని బయటకు తీశారు. దాదాపు గంటల తరబడి సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం సుబ్బ లక్ష్మమ్మ కోలుకుంటున్నారని, ఆమెకు నొప్పి తగ్గి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ విజయం పట్ల క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ వైద్య బృందాన్ని అభినందించారు.