ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. ఏపీ కేబినెట్ భేటీలో..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. చంద్రబాబు చేసిన 5 తొలి సంతకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్.. మెగా DSC, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది. అలాగే అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్కు ఓకె చెప్పింది. YSR హెల్త్ వర్సిటీ పేరు NTRహెల్త్ వర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్శాఖలపై శ్వేతపత్రాలు విడుదలచేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఒకటో తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.
ఏపీలో గంజాయిని అరికట్టడంపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. మత్తు పదార్థాల నివారణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా మంత్రులు లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్రను నియమించారు.
మెగా డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం.. కొత్తగా టెట్ నిర్వహించాలా లేదంటే టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలా అనే ప్రతిపాదనపై కేబినెట్ చర్చిచింది. జూలై ఒకటి నుంచి నిర్వహించే డీఎస్సీ నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను కేబినెట్ ముందుంచారు అధికారులు. డిసెంబర్ 10లోగా 16,347 పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళిక రచించారు.