
ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత నష్టాలు ఎందరినో వెనక్కి నెట్టేస్తాయి. కానీ, లక్ష్యం బలంగా ఉంటే ఎన్ని అడ్డంకులైనా తలవంచాల్సిందే అని విశాఖపట్నంకు చెందిన జయ వెంకట కిషోర్ బాబు తన విజయ ప్రస్థానంతో నిరూపించారు. 19 ఏళ్ల వయసులోనే ఉద్యోగ ప్రయాణం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు.
కిషోర్ బాబు ప్రయాణం అంత సులభం కాదు. 2017లో తండ్రి మరణించినప్పుడు ఆయన జేఎన్టీయూ కాకినాడలో కాలేజీలో చదువుకుంటున్నారు. కుటుంబానికి అండగా నిలవాలని, సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఓ)గా 21 ఏళ్లకే నియమితులయ్యారు. ఈ రంగంలో నాలుగు సంవత్సరాలు పనిచేశారు. కోవిడ్ సమయంలోనూ నిరంతరం కృషి చేస్తూ, ఆ అనుభవంతో ఏపీజీవీబీలో బ్రాంచ్ మేనేజర్గా (స్కేల్-2) 26 ఏళ్లకే ఎంపికయ్యారు. ఈ హోదాకు రావడానికి సాధారణంగా 12-15 సంవత్సరాలు పడుతుండగా, ఆయన అతి తక్కువ వయసులోనే ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వంలో టాప్ గ్రేడ్-బి ఉద్యోగాలపై దృష్టి సారించిన కిషోర్ బాబు, ఎస్సెస్సీ సీజీఎల్ (SSC CGL) పరీక్షకు సిద్ధపడాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో భద్రాచలంలోని ముంపు ప్రాంతమైన వేలేరుపాడులో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న ఆయన, రోజూ 40 కిలోమీటర్ల చొప్పున మొత్తం 80 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. ఈ రెండు గంటల ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా, మొబైల్ ఫోన్లో జనరల్ స్టడీస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్ వింటూ సన్నద్ధమయ్యారు. కేవలం 30 రోజుల పాటు నిరంతరం ప్రిపరేషన్, రోజువారీ మాక్ టెస్టులతో తన స్కోరును అసాధారణంగా పెంచుకున్నారు. కేవలం వినడం ద్వారానే మానసిక గణన సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుని, పెన్, పేపర్ లేకుండానే సమస్యలను పరిష్కరించడం ప్రారంభించారు.
కిషోర్ బాబు విజయానికి ఆయన కుటుంబ సభ్యుల అండదండలు ఎంతో కీలకం. “నా తల్లి ఏ రోజు కూడా నా ప్రిపరేషన్ గురించి గానీ, ఉద్యోగాలు మానేసి ఉన్నత లక్ష్యాల వైపు వెళ్లడం గురించి గానీ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు” అని ఆయన కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హోమ్ ట్యూషన్లు చెప్పి చదువు కొనసాగించిన ఆయన కష్టాన్ని, పట్టుదలను తల్లి ఎల్లప్పుడూ ప్రోత్సహించారు. మొదట్లో బంధువులు జాబులు మానేయడంపై అనుమానాలు వ్యక్తం చేసినా, ఇప్పుడు ఆయన విజయాన్ని చూసి సంతోషిస్తున్నారు. “మన పీక్ పీరియడ్ 21 నుంచి 30 ఏళ్లు, ఈ సమయంలోనే ఉన్నత లక్ష్యాల కోసం ప్రయత్నించాలి” అని ఆయన యువతకు సూచిస్తారు.
“ఏ ఉద్యోగం చిన్నది కాదు, ప్రతి జాబూ నాకు ఎంతో కొంత నేర్పింది, ఇచ్చింది” అని కిషోర్ బాబు పేర్కొన్నారు. ఇన్కమ్ టాక్స్, ఈడీ, సీబీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో దక్షిణాది వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని, సరైన దిశలో కృషి చేస్తే అలాంటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ కాకపోయినా ఎస్సెస్సీ సీజీఎల్ వంటి పరీక్షలు మంచి అవకాశాలని ఆయన చెబుతారు. తన అనుభవాలను పంచుకోవడానికి “Learn with Macherla” పేరుతో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్లను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్గా ఉన్నా, ఆయన తదుపరి లక్ష్యం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా స్థానం పొందడం. జయ వెంకట కిషోర్ బాబు నిరంతర కృషి, పట్టుదల, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునే తత్వం యువతకు గొప్ప స్ఫూర్తిని అందిస్తుంది.