
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోని గరువుపాలెం ప్రవేటు పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు ఒకేసారి కనిపించకపోవడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. బడికి వెళ్లిన విద్యార్ధులు తిరిగి రాకపోవడంతో తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరవై నాలుగు గంటలు గడవకముందే విద్యార్ధులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని పిఎస్ తరలించి అక్కడ నుండి గుంటూరు తీసుకొస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుండవరం గ్రామానికి చెందిన పదిహేనేళ్ల వెంకట గోపి, వేజండ్ల గ్రామానికి చెందిన పదమూడేళ్ల జమీర్ అహ్మద్, సుద్దపల్లి గ్రామానికి చెందిన పన్నెండేళ్ల భరత్ గరువు పాలెంలోని ఒక ప్రవేటు పాఠశాలలో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వచ్చిన విద్యార్ధులు తిరిగి ఇంటికి వెళ్లలేదు. స్కూల్ ముగిసిన తర్వాత ముగ్గురు కలిసి భరత్ ఇంటికి వెళ్లారు. అక్కడ నుండి మాయం అయ్యారు. రాత్రంతా పిల్లల కోసం వెతికిన తల్లిదండ్రులు లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయితే వెంకట గోపి వద్ద ఫోన్ ఉన్నట్లు వారి బంధువులు పోలీసుల ద్రుష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆ ఫోన్ నంబర్ ను పోలీసులు ట్రాకింగ్ లో పెట్టారు. విద్యార్ధులు హైదరాబాద్, వరంగల్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత సోమవారం ఢిల్లీలోని ఒక దుకాణం వద్ద అనుమానంగా సంచరిస్తుండటంతో యజమాని వారితో మాట్లాడి వారి దగ్గర ఫోన్ ఉన్నట్లు తెలుసుకున్నాడు.
వెంటనే ఆ నంబర్ నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేయించాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దుకాణం యజమానితో చెప్పి వెంటనే వారిని దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు తరలించాలని సూచించారు. ఆ దుకాణం యజమాని వారిని స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అప్పగించారు. అక్కడ నుండి విద్యార్ధులను గుంటూరు తీసుకొచ్చేందుకు ఒక టీం ఢిల్లీ వెళ్లింది. అయితే ఈ ముగ్గురిలో పెద్ద వాడైన గోపి ఇంట్లో ఇరవై రూపాయలు తీసుకొచ్చి తన స్నేహితులకు ఢిల్లీ చూపిస్తానని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి కోసం తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు. వారు క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి