VBGRAMG: ఉపాధి హామీ పథకం లబ్దిదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఇకపై 48 గంటల్లోనే ప్రాసెస్..

ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ది పొందుతున్నవారికి అలర్ట్. ఏపీ ప్రభుత్వం కొత్త కార్డుల జారీని షురూ చేసింది. కొత్త కార్డు కావాల్సినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం పలు నిబంధనలను కూడా రూపొందించింది. ప్రస్తుతం ఉన్న రూల్స్‌లో పలు మార్పులు చేశారు.

VBGRAMG: ఉపాధి హామీ పథకం లబ్దిదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్.. ఇకపై 48 గంటల్లోనే ప్రాసెస్..
Upadhi Hami Padakam

Updated on: Feb 16, 2026 | 1:02 PM

ఏపీలో ఉపాధి హామీ పథకం లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త కార్డుల జారీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. కేంద్రం ఇటీవల మహత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ గ్రామీణ రోజ్ గార్ మిషన్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కార్డుల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 48 రోజుల్లోనే జాబ్ కార్డ్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు నిబంధనలను ప్రవేశపెట్టారు. గ్రామాల్లో ఉండే ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆఫీసర్లను ఆశ్రయించి ఈ కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

కొత్త కార్డులు పొందటం ఎలా అంటే..?

కొత్త కార్డు పొందాలంటే లబ్దిదారులు ముందుగా దరఖాస్తు ఫారం పెట్టుకోవాలి. అనంతరం అధికారులు ఈకేవైసీ ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత అధికారులు పరిశీలించి కార్డును జారీ చేస్తారు. 48 గంటల్లోగా తప్పనిసరిగా ఈ కార్డును లబ్దిదారులకు అందించాల్సి ఉంటుంది. ఉచితంగా ఈ కార్డును అందిస్తారు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త కార్డులు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ వాటా ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరికొంత వాటా ఇచ్చి ఈ పథకం అమలు చేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకం అమలవుతోంది.

ఫేస్ రికగ్నేషన్ ద్వారా అటెండెన్స్

ఇక ఉపాధి హామీ పథకంలో పనికి హాజరయ్యే లబ్దిదారుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో పనికి రాకపోయినా కొంతమంది హాజరు వేయించుకునేవారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ముఖ ఆధారిత హాజరు పద్దతిని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కొన్నిచోట్ల ఈ విధానం అమల్లో ఉండగా.. మార్చి తర్వాత పూర్తి స్థాయిలో అమలుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. కాగా ఈ పథకం ద్వారా ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పిస్తున్నారు. గతంలో వేతనాలు ఆలస్యంగా జమ చేసేవారు. కానీ ఇప్పుడు వేగవంతంగా అందించే ప్రక్రియను చేపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం మరిన్ని నిర్ణయాలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలకు చెక్ పట్టి క్రమ పద్దతిలో పథకం అమలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.