హైదరాబాద్‌లో చేప ప్రసాదం.. గోదావరిలో చేపలు-రొయ్యల విందు.. జూన్ 8న రెండు ప్రత్యేక కార్యక్రమాలు!

Mrigasira Karthi 2026: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో పేదల కోసం ఉచిత చేపలు, రొయ్యల విందును ఏర్పాటు చేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో చేప ప్రసాదం.. గోదావరిలో చేపలు-రొయ్యల విందు.. జూన్ 8న రెండు ప్రత్యేక కార్యక్రమాలు!
Mrigasira Karthi 2026

Edited By:

Updated on: Jun 03, 2026 | 10:28 PM

ఏలూరు: మృగశిర కార్తె రాకతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. ఎండ తీవ్రత తగ్గి వర్షాకాలం ఆరంభమయ్యే రోజున చేపలు తినడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక బలమైన సాంప్రదాయం. అయితే, ఈ ఏడాది జూన్ 8న రాబోతున్న మృగశిర కార్తె సందర్భంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు విభిన్నమైన, అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. హైదరాబాద్‌లో రోగుల కోసం ‘చేప ప్రసాదం’ సిద్ధమవుతుంటే, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేదల ఆకలి తీర్చడం కోసం ‘ఆక్వా విందు’ ప్లాన్ చేశారు.

అసలు ఏంటి ఈ ఆక్వా విందు… ఎందుకు ఏర్పాటుచేస్తున్నారు… మెనూ ఏంటి…?

జూన్ 8న మృగశిర కార్తె… రోజున అస్తమా రోగులకోసం హైదరాబాద్‌లో ‘చేప ప్రసాదం’ ఒకవైపు తయారవుతుంటే ఏపీలో పేదల కోసం ‘చేప, రొయ్యల విందు’ ఏర్పాటుచేస్తున్నారు. తెలుగు సంస్కృతిలో మృగశిర కార్తెకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. “మృగశిర కార్తెలో ముక్క లేనిదే ముద్ద దిగదు” అనేది సామెత. ఈ రోజున చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేపల వంటకాలను ఇష్టంగా తింటారు. అయితే, ఈ ఏడాది జూన్ 8న రాబోతున్న ఈ కార్తె పర్వదినం అటు భాగ్యనగరంలో ప్రాముఖ్యతను చాటుకుంటూనే, ఇటు గోదావరి జిల్లాల్లో మానవత్వానికి సరికొత్త వేదికగా మారబోతోంది. పాలకొల్లులో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పేదలకు చేపలు, రొయ్యలతో విందు భోజనాల ఏర్పాటుచేస్తున్నారు. ఏపీలో మొదటి సారి మృగసిర కార్తె రోజున ఏర్పాటుచేస్తున్న భోజనాల ఉద్దేశ్యం ఏంటి.. మరింత సమాచారం తెలుసుకుందాం.

భాగ్యనగరంలో ‘చేప ప్రసాదం’ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లో చేప ప్రసాదం వితరణ జరగడం ఒక దశాబ్దాల ఆనవాయితీ. ఉబ్బసం (ఆస్తమా), శ్వాసకోశ వ్యాధులతో బాధపడే లక్షలాది మంది రోగులు కేవలం ఈ ఒక్క రోజు కోసం దేశం నలుమూలల నుండి హైదరాబాద్‌కు తరలివస్తారు. బత్తిని కుటుంబీకులు ఎంతో పవిత్రంగా, ఉచితంగా అందించే ఈ వింత జీవకారుణ్య ఔషధాన్ని స్వీకరిస్తే ఆస్తమా నయమవుతుందని రోగుల నమ్మకం. ఈ ఏడాది కూడా జూన్ 8న ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే అసలు ఈ కార్తె విశేషం ఏంటి…

ఏపీలో ‘ఆక్వా విందు’.. పేదల కోసమే ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు హైదరాబాద్‌లో ఆరోగ్యం కోసం ‘చేప మందు’ పంపిణీ జరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అదే రోజున ఒక అద్భుతమైన ‘ఆక్వా విందు’కు శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మూడు ప్రధాన కేంద్రాలైన పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో జూన్ 8న ఈ భారీ ఉచిత విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా మృగశిర కార్తె రోజున మార్కెట్‌లో చేపల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. డిమాండ్ విపరీతంగా పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు అంత ధర పెట్టి చేపలను కొనుగోలు చేయలేవు. “అందరిలాగే తాము కూడా మృగశిర రోజున చేపలు తినాలి” అనే కోరిక ఉన్నా, ఆర్థిక స్తోమత లేక ఆగిపోయే పేద కుటుంబాల కోసమే ఈ ప్రత్యేక విందును ప్లాన్ చేశారు. ఆ రోజున ఆయా ప్రాంతాల్లోని పేదలకు నోరూరించేలా రకరకాల నాటు చేపల కూరలు, ఫ్రైలతో పాటు గోదావరి స్పెషల్ రొయ్యల ఇగురులతో కూడిన కమ్మని విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

డాలర్ల వర్షం కురిపించే ఆక్వా రంగానికి గోదావరి జిల్లాలు పుట్టినిల్లు. అలాంటి చోట, మృగశిర కార్తె రోజున ఏ ఒక్క పేదవాడు కూడా చేపల కూర తినకుండా ఉండకూడదనే సత్సంకల్పంతో పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ రోజున ఆకలితో ఉన్న పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం పెట్టడమే పరమార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జూన్ 8న ఒకే రోజున.. ఒకవైపు హైదరాబాద్‌లో వ్యాధి నివారణ కోసం ‘చేప ప్రసాదం’ వితరణ జరుగుతుంటే, మరోవైపు పశ్చిమ గోదావరి తీరాన పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం, వారి ముఖాల్లో సంతోషం చూడడం కోసం ‘చేపలు, రొయ్యల విందు’ సిద్ధమవుతోంది. సందర్భాలు వేరైనా, ఈ రెండు కార్యక్రమాలు తెలుగు వారి సంస్కృతిని, తోటి వారికి సహాయం చేయాలనే మానవత్వాన్ని చాటిచెబుతున్నాయి.

Follow Us