
వేసవికాలం ఆరోగ్యం కోసం జ్యూస్ సెంటర్లలో జ్యూస్ తాగుతున్నారా? అవి ఎంత మేరకు శ్రేయస్సు అని ఆలోచించారా? కుళ్లిన పండ్లతో, శుభ్రం లేని పండ్లతో జ్యూస్ తయారు చేయొచ్చు? జరభద్రం. అంతేకాదు బాదం మిల్క్ సెంటర్ లో బాదం మిల్క్ తాగుతున్నారా? మరి, ఆసుపత్రి బెడ్ ఎక్కాల్సిందే. బాదం మిల్క్ నిల్వ ఉండటానికి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకర కెమికల్స్ కలపవచ్చు.. బీ కేర్ ఫుల్.. విజయనగరం జిల్లాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్స్ చేసిన తనిఖీలలో అదే బయటపడింది. పరిశీలించిన అధికారులే అవాక్కయ్యారు. విజయనగరం జిల్లాలో వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు జిల్లావాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు శరీరానికి చల్లదనం కోసం జ్యూస్ సెంటర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పెరిగిన కస్టమర్ల రద్దీ తో నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రక్కనపెట్టి కాసులకు కక్కుర్తి పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జిల్లాలోని పలు మిల్క్ సెంటర్లు, జ్యూస్ షాప్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పరిశుభ్రత లేకుండా జ్యూస్ తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల నిల్వ ఉంచిన పాత జ్యూస్లను తిరిగి వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కుళ్లిన పండ్లతో జ్యూస్ తయారు చేస్తున్న ఘటనలు బయటపడ్డాయి. ఇంకా బాదం మిల్క్ వంటి పానీయాలు ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆరోగ్యానికి హానికరమైన ఈ చర్యలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరించారు.
పరిశుభ్రత ప్రమాణాలు పాటించని ఒక జ్యూస్ సెంటర్ను ఫుడ్ ఇన్స్పెక్టర్ సీజ్ చేశారు. అలాగే కుళ్లిపోయిన పండ్లు, అనారోగ్యానికి కారణమయ్యే ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు బయట జ్యూస్ తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత ఉన్న కేంద్రాలనే ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో వినియోగదారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం కోసం తాగుతున్న జ్యూస్లు ప్రమాదకరంగా మారకూడదంటే జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..