
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల కుముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాదు.. రైతుల పలు నిర్ణయాలు తీసుకుంటూ రైతు పక్షపాతి అని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏపీలోని అరటి సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. పులివెందుల మార్కెట్ యార్డు ఆవరణలో ఏపీలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన అరటి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఈ ప్రాంతంలోని అరటి రైతులకు వ్యాపార అవకాశాలను మెరుగుపరుస్తుంది. మంచి ధరలను పొందడానికి సహాయపడుతుంది. ఏడాది పొడవునా అరటిపండ్లకు మంచి గిరాకీ ఉందని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. కడప, అనంతపురం ప్రాంతాల నుంచి ఎక్కువగా పండే అరటిలో నాణ్యత, రుచి, వెరైటీ కారణంగా ఇతర దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది.
పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో ముఖ్యమంత్రి ఒకరోజు పర్యటనలో ఉన్నారు. రూ.20.15 కోట్ల వ్యయంతో 51,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. 32 టన్నుల అరటి, తీపి నారింజ పండ్లను సేకరించే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంట్ ప్రతిరోజూ 32 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేక టబ్ లలో అరటి కాయలను శుభ్రపరుస్తుంది. 45 కిలోవాట్ల కూలింగ్ ఛాంబర్, 30.6 కిలోవాట్ల కోల్డ్ స్టోరేజ్, ఆరు కూలింగ్ సెల్స్ ఉన్న యూనిట్లో తీపి నారింజ పండ్లను మరింత గ్రేడింగ్ చేయనున్నారు.
మార్కెట్లలో తగిన ధర లభించే వరకు రైతులు అరటి, తీపి నారింజ పండ్లను 40 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వే బ్రిడ్జిని కూడా నిర్మించినట్లు అధికార వర్గాలు తెలిపాయి
ఈ ప్యాక్ హౌస్ వల్ల సాధారణ పంట రోజుల్లో కూడా రైతులకు లాభదాయకమైన ఆదాయం లభిస్తుందని, మంచి ధరలు లభిస్తాయని అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.