
అక్టోబర్ 26, 27, 28, 29 తారీఖులు. రౌండప్ చేసిపెట్టుకోండి.. ఆదివారం నుంచి నాలుగురోజులు ఏపీకి రెయిన్ టెర్రర్..! ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. తర్వాత తీవ్ర వాయుగుండంగా, తుఫానుగా బలపడబోతోంది. దీనికి మొంథా తుఫానుగా నామకరణం చేశారు. మొదటి రెండురోజులు సాధారణ అలర్ట్.. తర్వాతి రెండురోజులు రెడ్ అలర్ట్ తప్పదంటోంది IMD.
ఏపీ, ఒడిషా మధ్య దోబూచులాడిన వాయుగుండం కదలికలపై ప్రస్తుతానికి ఓ స్పష్టతైతే వచ్చింది. మొంథా తుఫాన్ ఎక్కడ తీరం దాటినా.. ఆంధ్రప్రదేశ్ మీద పంజా విసరడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ నుంచి తిరుపతి వరకు, ఉత్తర-దక్షిణ కోస్తా జిల్లాలన్నిటికీ రెయిన్ ఎలర్ట్ జారీ ఐంది. తుఫాన్గా మారాక.. 27, 28 తేదీల్లో ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం…
అక్టోబర్ 27వ తేదీ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ ఐంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి.. ఈ జిల్లాల్లో అత్యధికంగా 22 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక కోనసీమ, వెస్ట్ గోదావరి, క్రిష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరంజ్ ఆలర్ట్ జారీ ఐంది. ఇక్కడ 12 నుంచి 22 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్సుంది.
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీయార్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ ఐంది. ఇక్కడ ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ఇది 27వ తేదీ పరిస్థితి.
ఇక 28 వతేదీ తీవ్రతుఫానుగా మారే సమయానికి ప్రభావం పెరిగి, వాన దంచికొట్టబోతోంది. మొత్తం 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ ఐంది. కాకినాడ, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.
అల్లూరి, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ ఎలర్ట్ ఉంది. ఇక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.
శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. ఇక్కడ కూడా 28వ తేదీ ఒక మోస్తరు వానలు కురుస్తాయి
29వ తేదీ కూడా తుపాను తీవ్రత కనిపిస్తుంది. గంటకు 70 నుంచి 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచి, చెట్లునేలకూలే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఫేస్ చేయాలని ఆదేశాలొచ్చాయి. NDRF, SDRF టీమ్లను సన్నద్ధం చేశారు. కలెక్టరేట్, RDO, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు మానుకోవాల్సిందేనట.
అటు, పొరుగు తీర రాష్ట్రం ఒడిషాలోనూ రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది. ఒడిషాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో కుండపోతకు ఛాన్సుందని IMD చెబుతోంది. గజపతి, రాయగడ, మల్కాన్గిరి జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం తప్పేలా లేదు.