
సైబర్ నేరగాళ్లు పంథా మార్చారు… పెద్ద పెద్ద వ్యాపారస్థులు, హై ప్రొఫైల్ ఉన్నవాళ్లను కాస్త పక్కకునెట్టి.. చిన్న, చిన్న వ్యాపారులపై దృష్టి పెట్టారు. అటువంటి వారిని ఆకర్షించడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. బ్యాంక్ ఖాతాలున్న వ్యాపారులను ముందుగా టార్గెట్ చేస్తారు. వారు ఉపయోగించే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటిపై దృష్టి పెడతారు. ఆతర్వాత ఏపికే ఫైల్స్ పంపుతారు. ఆ ఫైల్స్ ఓపెన్ చేయగానే యాప్లను పంపి క్విజ్ పోటీల పేరుతో ఆకట్టుకుంటారు. సులభంగా ఉండే ప్రశ్నలను సంధిస్తారు. బాహుబలి ఎప్పుడు రిలీజ్ అయింది. సమాధానం తెలియకపోలే ఆప్షన్స్ చూడండి అంటూ ట్రాప్ చేస్తూ వెళ్తారు. సరైన సమాధానం చెప్పిన వెంటనే యాభై, వంద రూపాయల చిన్న మొత్తాలను యాప్లోకి పంపుతారు. ఇలా పూర్తిగా తమ వలలో చిక్కారని నిర్ధారించుకున్న.. తర్వాత ఆ మొత్తాలను మీ ఖాతాలకు జమ చేస్తామని నమ్మబలుకుతారు. అలా ఆధార్, బ్యాంక్ డిటైల్స్ తీసుకుంటారు. వారు గెలిచినట్లుగా అక్కడ చూపించే.. చిన్న మొత్తాన్ని కూడా బాధితులు డ్రా చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలా సేకరించిన ఖాతాలను సైబర్ నేరం ద్వారా సంపాదించిన మొత్తాలను ట్రాన్స్ ఫర్ చేసుకొని వాటిని డ్రా చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు.
అయితే ఇదంతా ఎలా బయటపడిందంటే సోమవారం రోజు ఐదారుగురు ఇదే తరహాలో మోసపోయి పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ నేరగాళ్ల సరికొత్త మార్గం బయటపడింది. పోలీసులను ఆశ్రయించిన వాళ్లంతా చిరు వ్యాపారులు. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లే… దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో సైబర్ నేరగాళ్లే తమ పంథా మార్చుకొని చోటా మోటా వారిని టార్గెట్ చేసినట్లు అర్ధమైంది.
దీంతో పోలీసులు ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా తెలియని ఫైల్స్ ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు తెలుగులోనే మాట్లాడుతుండటంతో సులభంగా వారి మాయమాటలకు పడిపోతున్నారు. ఈ విషయంలో కూడా వ్యక్తిగత వివరాలు ఎవరికి ఇవ్వొద్దని చెబుతున్నారు. అనుమానం వచ్చిన వెంటనే బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలు జరగకుండా చూసుకోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం చేయాలంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కథనాల కోసం క్లిక్ చేయండి.