ఆ జిల్లాలో జోరుగా సాగుతున్న పొలిటికల్ పందేలు.. తెరవెనుక ఉన్నది వీళ్లే..
ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపుపై పందెం రాయుళ్లు రోజుకో కొత్త ఆఫర్లతో రెచ్చిపోతున్నారు. పోలింగ్ జరిగిన మే 13 సాయంత్రం నుంచి మొదలైన ఈ పందెం గోల రోజురోజుకు కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకునేందుకు పలు రకాల పందేలను కాస్తున్నారట. పోలింగ్ రోజు సాయత్రం ఒకటికి ఒకటి అన్నట్టుగా మొదలైన పందేలు రానురాను ఒకటికి రెండు అన్నట్టుగా మారిపోయాయి.
ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపుపై పందెం రాయుళ్లు రోజుకో కొత్త ఆఫర్లతో రెచ్చిపోతున్నారు. పోలింగ్ జరిగిన మే 13 సాయంత్రం నుంచి మొదలైన ఈ పందెం గోల రోజురోజుకు కొత్త కొత్త ఆఫర్లతో ఆకట్టుకునేందుకు పలు రకాల పందేలను కాస్తున్నారట. పోలింగ్ రోజు సాయత్రం ఒకటికి ఒకటి అన్నట్టుగా మొదలైన పందేలు రానురాను ఒకటికి రెండు అన్నట్టుగా మారిపోయాయి. ప్రస్తుతం లక్ష పందెం కాస్తే రెండు లక్షలు ఆఫర్ ఇస్తున్నారట. ఇంతకీ ఎవరు ఈ ఆఫర్లు ఇస్తున్నారు. ఒంగోలులో టిడిపి 20 వేల మెజారిటీతో గెలుస్తుందని పోలింగ్ జరిగిన మే 13 సాయంత్రం నుంచి పందేలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు లక్షకు లక్ష ఇస్తామని టిడిపి మద్దతు దారులు పందెం కాశారట.. వైసిపి నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా పందేనికి సై అంటూ కాలుదువ్వారు. 20 రోజులుగా ఇదే పందేలు జోరుగా సాగాయట.. అయితే ప్రస్తుతం వైసిపి నేతలు కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నట్లు సమాచారం. టిడిపికి గెలుపుపై అంత నమ్మకం ఉంటే లక్షకు రెండు లక్షలు ఇస్తే పందెం కాస్తామని వైసిపి మద్దతుదారులు ప్రతిపాదిస్తున్నారట. దీంతో ఒంగోలులో బెట్టింగ్ వ్యవహారం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోందని ప్రచారం జరుగుతోంది.
వార్ వన్సైడ్ నుంచి నువ్వా.. నేనా వరకు..
సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీలో జరిగిన ఎన్నికలు వార్ ఒన్ సైడ్ నుంచి నువ్వా.. నేనా.. అన్నట్టుగా సాగాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన ప్రత్యర్థులిద్దరూ 2012 నుంచి ఒకరిపై ఒకరు తలపడుతుండటంతో ఇక్కడ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంది. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావులు వరుసగా నాలుగోసారి తలపడ్డారు. రాజకీయాల్లో ప్రతి ఎన్నికా ప్రత్యేకమైనదే అయినా ఒంగోలులో వీరిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయి.
మా మెజారిటీ 9 వేలు.. వైసిపి..
ఒంగోలు నియోజకవర్గంలోని ఒంగోలు అర్బన్, కొత్తపట్నం మండలాల్లో మెజారిటీ తమదే అంటూ ఎమ్మెల్యే బాలినేని వర్గీయులు బల్లగుద్ది మరీ చెబుతున్నారట. ఈసారి తమకు 9 వేలకు పైగా మెజారిటీ వస్తుందని ఈ రెండు మండలాల వారీగా లెక్కలు వేశారట. ఒంగోలు అర్బన్లో వైసిపికి 6 వేల మెజారిటీ వస్తుందని, అలాగే ఒంగోలు రూరల్ మండలంలో 1200 మెజారిటీ తగ్గుతుందని, మరోవైపు కొత్తపట్నం మండలంలో వైసిపికి 4,800 మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారట. ఒంగోలు నియోజకవర్గంలో వైసిపి 9 వేల పైచిలుకు ఓట్లతో గెలుస్తోందని ప్రచారం చేస్తున్నారట. అందుకు తగ్గట్టుగా వైసిపి నేతలు జోరుగా బెట్టింగ్లకు కూడా దిగుతున్నారని సమాచారం.
మా మెజారిటీ 16 వేలు.. టిడిపి..
ఒంగోలులో గెలుపుపై వైసిపి లెక్కలను చూసిన టిడిపి అబ్బే.. అంతసీన్ లేదంటున్నట్లు తెలుస్తోంది. తమ హయంలోనే అభివృద్ది చేశామని, ఇప్పుడు కూటమి తరపున పోటీ చేస్తున్నందున గెలుపు తమ వాకిట్లోనే ఉందంటున్నారట కొందరు నేతలు. కాకపోతే మెజారిటీ ఎంత అన్నదానిపైనే లెక్కలు వేస్తున్నామంటున్నారట దామచర్ల వర్గీయులు. టిడిపి వేసిన లెక్కల్లో ఒంగోలు అర్బన్లో టిడిపికి 13 వేల మెజారిటీ వస్తుందట. అలాగే ఒంగోలు రూరల్ మండలంలో 5200 మెజారిటీ వస్తుందని.. మరోవైపు కొత్తపట్నం మండలంలో మాత్రం 1450 మెజారిటీ తగ్గుతోందని లెక్కలు వేసుకుంటన్నారు. ఇవన్నీ కలిపి ఒంగోలు నియోజకవర్గంలో టిడిపి 16 వేల పైచిలుకు మెజారిటీతో గెలుస్తోందని అంచనా వేస్తున్నారట టీడీపీ నేతలు. అందుకు తగ్గట్టుగానే జోరుగా పందేలు కాస్తున్నారట.
తెరవెనుక క్రికెట్ బుకీలు..
బెట్టింగ్ల పేరు ఎత్తగానే రాష్ట్రవ్యాప్తంగా జరిగే బెట్టింగుల్లో ఒంగోలుకు చెందిన కొంతమంది వ్యక్తుల పేర్లు గతంలోనే ప్రముఖంగా వినిపించాయి. పేరుకు ఏదో ఒక వ్యాపారం చేస్తూ అండర్ గ్రౌండ్లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడేవారు ఒంగోలు నుంచే ఎక్కువగా ఉన్నారని చెప్పుకుంటారు. వీరంతా ఒంగోలులో వ్యాపారాలు చేస్తున్నా, ఇక్కడ మాత్రం క్రికెట్ బెట్టింగ్లు కాయరట. హైదరాబాద్, ముంబాయి కేంద్రాలుగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతుంటారని సమాచారం. ఈ క్రమంలోనే ఐదేళ్ళకు ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తలదూర్చి పొలిటికల్ బెట్టింగ్లకు వేదికలు ఏర్పాటు చేస్తుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఒంగోలు కేంద్రంగా గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు కాస్తున్నట్టు భావిస్తున్నారు. కౌంటిగ్ సమయానికి ఎవరు గెలిచినా, ఓడినా బెట్టింగ్ వేదికలు ఏర్పాటు చేసినా పందెం రాయుళ్ళకు మాత్రం నోట్ల పండగే అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..