ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. తీరిన చిరకాల స్వప్నం

Visakhapatnam Railway Gazette Release: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు.

ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. తీరిన చిరకాల స్వప్నం
Vizag Railway Zone Gazette

Updated on: May 05, 2026 | 7:54 PM

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. 2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుందన్నారు.

నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. సుమారు 463 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతం విశాఖపట్నం డివిజన్‌గా మారి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో ఉంటుంది. మిగిలిన 696 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేసి, దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉంచారు.

ఈ జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం విశాఖలోని ముడసర్లోవ వద్ద సుమారు 52.2 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. జోన్ కార్యాలయ భవనాలు, ఇతర వసతుల కోసం సుమారు రూ.184 కోట్లు కేటాయించారు. ఈ జోన్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, కొత్త రైళ్లు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us