APPSC: ”గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి..” ఏపీ సర్కార్‌కు అభ్యర్ధుల వినతి..

|

Aug 13, 2024 | 6:53 AM

ఏపీలో త్వరలో గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి గ్రూప్‌గా రిక్వెస్ట్‌ చేస్తున్నారు అభ్యర్థులు. గత ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని..ఈ ప్రభుత్వమైనా స్పందించాలని కోరుతున్నారు. ఇంతకూ ఏంటా రిక్వెస్ట్‌..?

APPSC: గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.. ఏపీ సర్కార్‌కు అభ్యర్ధుల వినతి..
APPSC Dates
Follow us on

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన విడుదలయ్యాయి. మొత్తం 1 లక్షా 48 వేల 881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 91 వేల 463 మంది పరీక్ష రాశారు. ఫలితాల్లో 1:50 చొప్పున 4 వేల 496 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మార్చి 17న రాష్ట్ర వ్యాప్తంగా18 జిల్లాల్లో 301 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. కేవలం 24 రోజుల్లోనే కమిషన్‌ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్‌ 1 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. తదుపరి దశ అయిన మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబరు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అయితే తాజాగా ప్రిలిమ్స్‌ పరీక్షలో 1:100 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి, మెయిన్స్‌కు అనుమతి ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

డీవైఈఓ, గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షలకు ప్రిలిమ్స్‌ నుంచి 1:100 నిష్పత్తిలోనే ఎంపిక చేశారని..గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. అలాగే గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం కూడా ఒక ప్రధాన కారణంగా అభ్యర్థులు చెబుతున్నారు. కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు ఉండడంతో గ్రూప్‌ 1 సిలబస్‌ను రివిజన్‌ చేయలేకపోయామని చెబుతున్నారు. దీనిపై గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదనీ, కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలోనే గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించి మెయిన్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తే.. పరీక్ష సన్నద్ధతకు అభ్యర్థులు మరింత సమయం కోరే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పట్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు జరిగే ఛాన్స్‌ లేనట్లే అవుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై వేచి చూడాలి.

 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల ఇక్కడ క్లిక్ చేయండి..