ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్యం/ఆగ్నేయ దిశలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రంపై ఉన్న అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతుంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటలలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, మరింత తీవ్రమై జనవరి 31న నైరుతి బంగాళాఖాతం మీద వాయుగుండంగా మారి ఫిబ్రవరి 1న శ్రీలంక తీరానికి చేరుకుంటుందని భాతావర వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితిలో చాలా మార్పులు ఉంటాయని ప్రకటించారు. రాబోవు మూడు రోజులకు సంబంధించి ఏపీ వాతావరణ పరిస్థితుల వివరాలను ప్రకటించారు. దాని ప్రకారం..
శనివారం, ఆదివారం నాడు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా, ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఇక సోమవారం నాడు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
శనివారం నాడు దక్షిణ కోస్తాంధ్రలో పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి రెండు చోట్ల పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆదివారం నాడు కూడా పొడి వాతావరణం ఉంటుంది. సోమవారం నాడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
శనివారం, ఆదివారం రాయలసీమ ప్రాంతంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు, సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉంటాయి. ఇక సోమవారం నాడు మాత్రం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..