
చిన్నారుల్లో పోషకాహార లోపానికి చెక్ పెట్టి.. వారికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు (NRCలు) ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా మరో 175 పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 21 కేంద్రాలు కాస్తా 42కు, 340 పడకలు 515కు పెరగనున్నాయి. ఈ వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
అరకు నుంచి మచిలీపట్నం వరకు..
ఈ కొత్త NRCల ఏర్పాటు ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. గిరిజన ప్రాంతాల నుంచి కోస్తా, రాయలసీమ వరకు విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అరకు, ముంచింగిపుట్, చింతపల్లి, అనకాపల్లి, బాపట్ల, నంద్యాల, సున్నిపెంట, నరసరావుపేటలో ఇప్పటికే ఎనిమిది కేంద్రాలకు అనుమతి లభించింది. వీటి ద్వారా 80 పడకలు అందుబాటులోకి వస్తాయి. అరకు, నంద్యాల కేంద్రాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి.
గిరిజన చిన్నారులపై ప్రత్యేక ఫోకస్
గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు చికిత్స కోసం మరో ఏడు ఇంటిగ్రేటెడ్ NRCలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్డతీగల, వై.రామవరం, సాలూరు, పాలకొండ, బద్రగిరి, కురుపాం, చినమేరంగిలో ఇవి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో ఐదు పడకల చొప్పున మొత్తం 35 పడకలు ఉంటాయి. అడ్డతీగల, వై.రామవరం కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నారు.
మరో ఆరు కేంద్రాలు.. 60 బెడ్లు
ఇక 2026-27లో మరో ఆరు 10 పడకల NRCలకు ప్రభుత్వం మంజూరు చేసింది. మదనపల్లె, చిత్తూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, హిందూపురం, తణుకు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.ఈ ఆరు కేంద్రాలు అందుబాటులోకి వస్తే మరో 60 పడకలు చిన్నారులకు అందుబాటులోకి వస్తాయి.
చికిత్స ఫలితం చూస్తే సూపర్..!
NRCల్లో అందిస్తున్న చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది. 2024-25లో 5,961 మంది చిన్నారులు చేరగా.. 5,878 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అంటే 98.60 శాతం మంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు. 2025-26లో 6,195 మంది చేరగా.. 6,168 మంది కోలుకున్నారు. ఇక 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,492 మంది చిన్నారులు చికిత్స పొందితే.. 2,462 మంది కోలుకున్నారు. ఈ కాలంలో విజయవంతమైన చికిత్స శాతం 98.80గా నమోదైంది.
రూ.16 కోట్లకు పైగా కేటాయింపులు
చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2026-27లో NRCల మౌలిక వసతులు, నిర్వహణ, ఆశా కార్యకర్తల ప్రోత్సాహకాల కోసం రూ.4.42 కోట్లు కేటాయించారు. మానవ వనరుల కోసం ఏడాదికి మరో రూ.12.22 కోట్లు మంజూరు చేశారు. అంటే.. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఇక దూర ప్రయాణం అవసరం లేకుండా.. వారి ప్రాంతానికి దగ్గర్లోనే వైద్యం, పోషకాహారం అందించేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.