ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకూ ఫలించాయి. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటించారు. విజయవాడ సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మున్సిపల్ కార్మికులకు 21 వేల రూపాయల వేతనం ఇస్తామన్నారు. భవిష్యత్లో వేతనం పెంపుదల చేస్తే 21 వేల రూపాయల వేతనాన్ని బేసిక్గా పరిగణనలోకి తీసుకుని పెంచుతామన్నారు. సమ్మె కాలానికి కూడా జీతాలు కూడా చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
దీంతోపాటు చనిపోయిన కార్మికులు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 నుంచి ఏడు లక్షలకు సాయం పెంచామన్నారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకున్నా ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. చర్చలు సఫలం కావడంతో కార్మిక సంఘాల నేతలు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ విధులకు యధావిధిగా హాజరుకానున్నారు. ఇచ్చిన హామీలు జీఓలో లేకపోతే మళ్లీ సమ్మె చేస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. గత 15 రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించారు. దీంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల అధికారులు, నాయకులే చీపురు పట్టుకున్నారు. మరి కొన్ని చోట్ల రోడ్లపై చెత్త ఎత్తేందుకు ప్రైవేట్ సిబ్బందిని ప్రభుత్వం నియమించినా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పారిశుద్ధ్య కార్మికులు. అయితే తాము చేసిన నిరసనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మున్సిపల్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..