
ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రేషన్ కార్డు లేనివారికి కూడా సన్నబియ్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది. దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా సామాన్యులకు సన్న బియ్యం పంపిణీకి రెడీ అయింది. కేవలం ఆధార్ కార్డు చూపించి ఈ బియ్యం తీసుకోవచ్చు. సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతు బజార్లు, రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ల ద్వారా సన్న బియ్యం 10 కిలోలు అతి తక్కువ ధరకే విక్రయిస్తారు. ఆగస్ట్ తొలివారం నుంచే ఈ విధానం అమలు చేస్తుండగా.. తొలుత రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అమలు చేశారు. ఇప్పుడు అందరికీ వర్తింపచేస్తున్నారు.
ప్రస్తుతం బయట రిటైల్ మార్కెట్లో నాణ్యమైన సన్నబియ్యం కిలోకు రూ.60 నుంచి రూ.65 మధ్య పలుకుతోంది. ఇటీవల ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బీపీటీ స్ట్రీమ్డ్ రైస్ కిలో రూ.52 చొప్పున విక్రయించాలని నిర్ణయించగా.. బీపీటీ ముడి(రా రైస్) బియ్యం కిలోకు రూ.50 చొప్పున విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 130 రైతు బజార్లతో పాటు రైస్ మిల్లుల వద్ద వీటిని అందించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేయడంతో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్లు పనిచేయకపోవడంతో బియ్యం అందించడంలో జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబానికి 25 కిలోల బస్తా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. తొలుత రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే అందించాలని నిర్ణయించడంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆ తర్వాత ఆధార్ వ్యవస్థ తీసుకురావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
అటు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మినీ మార్టులు ఏర్పాటు చేస్తోంది. సూపర్ మార్కెట్ల తరహాలోనే ఉంటే ఈ మార్టులో తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర సరుకులను అందిస్తోంది. దాదాపు 250కిపైగా వస్తువులను విక్రయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా మార్టులను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే ఇక్కడ ప్రతీ వస్తువులు అతి తక్కవ ధరకే లభిస్తోంది. రేషన్ డీలర్లకు ఈ మార్టుల బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీని వల్ల రేషన్ డీలర్లకు కూడా ఆదాయం పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేసింది.