Nandi Awards: తెలుగు సినిమాలకు మళ్లీ నంది అవార్డులు.. ఎప్పటి నుంచి ఇవ్వనున్నారంటే!

రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలపై చర్చించేందుకు సినీ నిర్మాతలు, ఛాంబర్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇదే అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్మాతలు మంత్రిని కోరారు.

Nandi Awards: తెలుగు సినిమాలకు మళ్లీ నంది అవార్డులు.. ఎప్పటి నుంచి ఇవ్వనున్నారంటే!
Nandi Awards

Edited By: Anand T

Updated on: Aug 11, 2025 | 7:43 PM

రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలపై చర్చించేందుకు సినీ నిర్మాతలు, ఛాంబర్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌తో కీలక సమావేశం అయ్యారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి. భరత్ భూషణ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు KL నారాయణ, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సినిమా నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, షూటింగ్‌లకు అనువైన వాతావరణం, పన్ను సడలింపులు, చిత్ర పరిశ్రమకు ప్రత్యేక పథకాల రూపకల్పన వంటి అంశాలపై ఈ సందర్భంగా విస్తృత చర్చ జరిగింది.

త్వరలో సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చ

గతంలో వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసాం. కానీ అందరం కలిసి కలిసిన సందర్భం లేదు. త్వరలో సమూహంగా కలసి, ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రోత్సాహక చర్యలపై విపులంగా చర్చిస్తాం” అని నిర్మాతలు KL నారాయణ, నాగవంశీ లు టీవీ9 తో తెలిపారు. హైదరాబాదులో జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెకు ఈ సమావేశానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.

నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రివర్గ ఆలోచన

సినీ నిర్మాతలతో భేటీ అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. నంది అవార్డులను ఈ ఏడాది నుంచే మళ్లీ ప్రారంభించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అవార్డులు ఎలా ఇవ్వాలి, ఏ విధానంలో కొనసాగించాలి అన్న విషయంపై పలు ప్రతిపాదనలు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇవ్వాలా, లేక విడిగా ఇవ్వాలా అన్నదానిపై కూడా చర్చించాం. ఒక రాష్ట్రంలో ఉత్తమ చిత్రం, మరో రాష్ట్రంలో కాకపోతే ఏర్పడే పరిస్థితులు కూడా పరిశీలనలో ఉన్నాయి” అని వివరించారు.

మంత్రి దుర్గేష్ చెప్పినట్లుగా, సెప్టెంబర్‌లోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరగనున్న అవకాశముంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ విస్తరణ, కొత్త స్టూడియోలు, ఫిల్మ్ సిటీ, షూటింగ్ స్పాట్ల అభివృద్ధి వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.