మోదీ ప్రకటన నేపథ్యంలో వైజాగ్ స్టీల్ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కొత్త టర్న్.! ప.గో జిల్లా పర్యటనలో వైసీపీ టార్గెట్‌గా హాట్ కామెంట్స్

|

Feb 27, 2021 | 4:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం..

మోదీ ప్రకటన నేపథ్యంలో వైజాగ్ స్టీల్ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కొత్త టర్న్.! ప.గో జిల్లా పర్యటనలో వైసీపీ టార్గెట్‌గా హాట్ కామెంట్స్
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం పర్యటించారు. ఏలూరులో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో కొందరు బీజేపీలో చేరారు. ఏపీలో అప్రకటిత ఎమర్జన్సీ నడుస్తోందని ఈ సందర్భంగా విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ప్రత్యర్థి పార్టీలను బెదిరించేందుకు, పోటీ లేకుండా చేసుకునేందుకు వైసీపీ రకరకాల మార్గాలు అనుసరిస్తోందన్నారు.

ఒకప్పుడు అసెంబ్లీలో తనను నోరు విప్పనీయడం లేదని రోడ్డెక్కిన జగన్‌.. ఈరోజు చేస్తున్నదేంటని సోమువీర్రాజు ప్రశ్నించారు. డెయిరీలు, షుగర్‌ఫ్యాక్టరీలో చౌకగా అమ్ముకున్నవారు ఈరోజు కేంద్రాన్ని నిందిస్తున్నారని ఆయన ఆరోపించారు. కమ్యూనిస్టులు చైనా ఏజెంట్లలా వ్యవహరిస్తూ దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉద్యమాలు చేస్తూ ప్రధానిని అవమానిస్తున్నారని సోము ఆగ్రహించారు.

ఏపీలో ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఉడుంపట్టులాగా సాగుతున్న వేళ సోము స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై దృష్టి సారించారు. నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కి తగ్గేదాకా తాము తగ్గబోమని కార్మికులు తెగేసి చెబుతున్న వేళ రాజకీయపార్టీలు ఈ అంశంపై లబ్దిపొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్మికులకు అధికార పార్టీ వైసీపీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నవేళ ఈ బీజేపీ నేతల కామెంట్స్‌ ఆసక్తిగా మారాయి. ఢిల్లీ వెళ్లి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపేస్తాం అని చెప్పిన ఏపీ బీజేపీ నేతలు మోదీ తాజా ప్రకటనతో కొత్త రాగం అందుకున్నారు.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను కప్పిబుచ్చడానికి… స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం అంటూ ప్రజలు దృష్టిని మరల్చుతున్నారన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. వైసీపీ, టీడీపీ కలిసి ఆడిస్తున్న స్టీల్‌ ప్లాంట్‌ డ్రామా అన్నారు. మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ కూడా అదే విమర్శ చేస్తు్న్నారు. రాష్ట్రంలో మతమార్పిళ్లు ప్రోత్సహిస్తు ప్రభుత్వ పెద్దలు అరాచకాలకు పాల్పడుతున్నారని.. దాన్ని కవర్‌ చేసేందుకే స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. ఇక బీజేపీ నాయకులకు వైసీపీ నేతలు కౌంటర్లిస్తూ ముందుకెళుతున్నారు. అలా రాజకీయాలు ఏపీలో రంజు రంజుగా సాగుతున్నాయి.

Read also : కరోనా టీకా తీసుకోవాలనుకునే వారికి ముఖ్య గమనిక : ఈ శని, ఆదివారాల్లో కరోనా టీకాలు వేయరు.. ఎందుకంటే.?