
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంపై సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్ప ప్రాంతాల్లో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో షియర్ జోన్ విస్తరించి ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆదివారం, సోమవారం, మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
రాయలసీమలో కూడా రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..