
ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ సేవలను మరింత ఆధునికంగా మార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ అంశంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నట్టు తెలిపారు. వీటిలో 12 మీటర్ల పొడవు, 35+1 సీటింగ్ సామర్థ్యం కలిగిన 621 బస్సులు ఉండగా.. 9 మీటర్ల పొడవు, 25+1 సీటింగ్ సామర్థ్యం గల 129 బస్సులు ఉండనున్నాయి.
ఈ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో చేరడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలు అందుబాటులోకి రానున్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ సరఫరా సామర్థ్యం, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన నగరాల్లో అవసరమైన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో ఈ-బస్సుల కోసం ప్రత్యేకంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. గుంటూరుకు సివిల్, ఎలక్ట్రికల్ పనుల కోసం రూ.27.49 కోట్లు, మంగళగిరికి రూ.16.25 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. 2026 చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ బస్సులుదోహదపడనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ ఆధునీకరణలో ఇది కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.