
ఏపీలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అందింది. జులై 22వ తేదీ నుంచి తల్లికి వందనం పథకం డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. దీంతో బుధవారం లక్షలాది మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో రూ.13 వేలు జమ కానున్నాయి. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తుండగా.. స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2 వేలు ప్రభుత్వం తీసుకుంటుంది. మిగతా రూ.13 వేలను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తింపచేయనుండగా.. వారి తరపున తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న నిధుల విడుదల ప్రక్రియ.. 24వ తేదీ వరకు కొనసాగనుంది.
‘తల్లికి వందనం’ పేరుతో సైబర్ నేరగాళ్లు స్పామ్ లింకులు పంపి డబ్బులు కాజేస్తున్నారు. “మీ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడాలంటే ఈ లింక్పై క్లిక్ చేయండి ” లేదా ” వెంటనే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి” అంటూ నకిలీ లింకులు పంపుతున్నారు. ఈ లింకులపై క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడే అవకాశముంది. మొబైల్ ఫోన్లకు వచ్చే ఫేక్ మెసేజ్లను నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నకిలీ లింకులను క్లిక్ చేస్తే అకౌంట్లలో ఉన్న సొమ్ము మొత్తం సైబర్ దొంగల పాలయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏటీఎం పిన్, ఆధార్ నంబర్, ఓటీపీ (OTP)ల వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని స్పష్టం చేశారు.
నకిలీ లింకులు నమ్మవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులపైనా క్లిక్ చేయకూడదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అలాంటి మెస్సేజ్లు పంపదని, దీంతో అలాంటి లింకులు కనిపిస్తే వాటి జోలికి వెళ్లవద్దని హెచ్చరించింది. తల్లికి వందన పథకంకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని లేదా స్కూల్ ప్రధానోపాధ్యాయులను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచించింది. లబ్ధిదారులు ఎవరూ దళారులను నమ్మవద్దని, ప్రభుత్వ అధికారిక ప్రక్రియ ద్వారానే పారదర్శకంగా నగదు బదిలీ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు