Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. సోమవారం నుంచి అది కూడా పంపిణీ.. వెళ్లి తీస్కోండి..

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. గ్యాస్ కొరత క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా అదనంగా గోధుమలు, రాగులు, జొన్నలు లాంటివి ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తోంది. అయితే సోమవారం నుంచి అది కూడా పంపిణీ చేయనున్నారు.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. సోమవారం నుంచి అది కూడా పంపిణీ.. వెళ్లి తీస్కోండి..
ration

Updated on: Mar 22, 2026 | 12:23 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత క్రమంలో చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ న్యూస్ అందించింది. గ్యాస్ కొరత నేపథ్యంలో రేషన్ షాపుల్లో మళ్ళీ కిరోసిన్ పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో సోమవారం నుంచి లీటరు చొప్పున రేషన్ కార్డుదారులకు కిరోసిన్ అందించాలని భావించింది. ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్రంగా ఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్‌ సోమవారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

కిరోసిన్ పంపిణీ ఎప్పటినుంచంటే..

అమరావతిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా.. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21వ తేదిన రావాల్సిన గ్యాస్ నౌక 26వ తేదీన చేరనున్నట్టు కేంద్రం సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. అప్పటి వరకు సరఫరాలో అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. గతంలో ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు కిరోసిన్ అందించేది. కానీ ఆ తర్వాత వీటిని నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ గ్యాస్ బండ దొరకని పరిస్థితి ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో కిరోసిన్ పంపిణీని తిరిగి ప్రారంభించింది. కేంద్రం కిరోసిన్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చిందని, దాని ప్రకారమే మళ్లీ సరఫరా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీని కిరోసిన్ రహితంగా మార్చామని, కానీ సంక్షోభ పరిస్థితుల్లో సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ముందుగా ఈ ప్రాంతాల్లోనే సరఫరా

కిరోసిన్‌ను ముందుగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవ్వనున్నట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అటు రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని చెప్పిన ఆయన.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఎప్పటిలాగే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా మొదలుపెట్టామని, ప్రాధాన్యత ప్రకారం పంపిణీ చేస్తున్నామన్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, హాస్టళ్లకు గ్యాస్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కొంతమంది అపోహలు సృష్టించడం వల్ల ప్రజలు భయపడి బుకింగ్స్ చేసుకుంటున్నారన్నారు. అలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని అన్నారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు ఓటీపీ ద్వారానే గ్యాస్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. బ్లాక్‌కు తరలించకుండా నిఘా పెట్టినట్లు చెప్పారు. అలాంటి చర్యలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Follow Us