
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువును మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15వ తేదీతో గడువు ముగియగా.. ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. చాలామంది రైతులు ఇంకా ఈ పథకంలో చేరకపోవడంతో వారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, తమ పంటలను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఎల్నీవో ప్రభావం ఉన్న క్రమంలో రైతులందరూ ఈ బీమా పథకంలో చేరాలని ఆయన సూచించారు. రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలవుతోంది. ఇందులో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. రైతులు కొంత ప్రీమియం చెల్లిస్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరికొంత ప్రీమియం బీమా సంస్థలకు చెల్లిస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు నష్టం జరిగినప్పుడు పరిహారం అందుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నీవో పరిస్ధితులు ఉన్నాయి. లోటు వర్షపాతం నమోదవుతోంది. భవిష్యత్తులో కూడా వర్షాలు పెద్దగా అశాజనకంగా లేవు. ఇలాంటి సమయంలో పంట నష్టపోయినప్పుడు పరిహారం అందుతుంది. ప్రతీ పంటకు బీమా వర్తిస్తుంది. రైతులు కొంత మొత్తం చెల్లిస్తే.. అధిక భాగాన్ని ప్రభుత్వాన్ని భరిస్తాయి. నష్టపోయిన ప్రతీ ఎకరాకు నష్టపరిహారం అనేది అందుతుంది. చీడపీడలు, తుఫాన్లు, వరదలు, వర్షాలు వంటి కారణాలతో పంటకు నష్టం జరిగినప్పుడు బీమా పథకం ద్వారా రైతులకు పరిహారం అందుతుంది.
పంటల బీమా పథకం కోసం సమీపంలోని సీఎస్ఈ లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించాలి. రైతు రిజిస్ట్రీ నంబర్ ఆధారంగా పంట బీమా స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కాగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఫిబ్రవరి 18,2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య లేదా తోటల పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగతా ప్రీమియంను ప్రభుత్వాలు భరిస్తాయి. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల ప్రీమియం బ్యాంకుల ద్వారా జమ అవుతుంది. మిగతా రైతులు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా నమోదు చేయించుకోవాలి.