
ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పుచేర్పులతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రజల నుంచి వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు , 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదలైంది. దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా… వాటిపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా యధావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు. అయితే రాయచోటిని అన్నమయ్య జిల్లాలోనే ఉంచే విధంగా సీఎంను ఒప్పిస్తానన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్కు మార్చాలని నిర్ణయించారు. అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్కు, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ పరిధిలోకి, అద్దంకి రెవెన్యూ డివిజన్లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్చేలా నిర్ణయం తీసుకున్నారు. కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి మార్చి ప్రకాశం జిల్లాలో వాటిని విలీనం చేయనున్నారు. కందుకూరు డివిజన్లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు కందుకూరు డివిజన్లోని మిగిలిన రెండు మండలాలు అయిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్లోకి మార్చనున్నారు.
ఇక పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్కు మార్చనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్కు మార్చడం, సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్కు మార్చబోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమదగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయడంతో పాటు గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్పుచేర్పుల తర్వాత ఈ డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..