Andhra Pradesh: మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో జవాన్ వీర మరణం.. నేడు స్వగ్రామానికి మృతదేహం

| Edited By: Srilakshmi C

Dec 18, 2023 | 8:03 AM

మావోయిస్టుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ ఎస్సై సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం కోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వెలగటూరుకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సుధాకర్ రెడ్డి చత్తీస్‌ఘడ్‌లో జరిగిన మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. దీంతో సుధాకర్ రెడ్డి స్వగ్రామం వెలగటూరులో..

Andhra Pradesh: మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో జవాన్ వీర మరణం.. నేడు స్వగ్రామానికి మృతదేహం
CRPF jawan Sudhakar Reddy
Follow us on

నంద్యాల, డిసెంబర్‌ 18: మావోయిస్టుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ ఎస్సై సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం కోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వెలగటూరుకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సుధాకర్ రెడ్డి చత్తీస్‌ఘడ్‌లో జరిగిన మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. దీంతో సుధాకర్ రెడ్డి స్వగ్రామం వెలగటూరులో విషాదఛాయలు అలుముకొన్నాయి. కోవెలకుంట్ల మండలం వెలగటూరు గ్రామానికి చెందిన గొంగటి వెంకట సుబ్బారెడ్డి, సుబ్బ లక్ష్మమ్మల ఒక్కగానొక్క కుమారుడు సుధాకర్ రెడ్డికి దేశభక్తి ఎక్కువ. 30 సంవత్సరాల క్రితం పోలీసు ఉద్యోగంపై మక్కువతో సీఆర్పీఎఫ్ లో జవానుగా చేరారు.

అనంతరం హెడ్ కానిస్టేబుల్ గా, ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం పదోన్నతి పొంది ఎస్సైగా చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సుధాకర్ రెడ్డి వీర మరణం పొందారు. ఆయనతోపాటు మరో జవాను గాయపడ్డారు. సోమవారం ఆయన భౌతిక కాయానికి స్వగ్రామమైన వెలగటూరులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనున్నారు.

సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు స్వగ్రామమైన వెలుగుటూరులోనే ఉండగా సుధాకర్ రెడ్డి భార్య నాగలక్ష్మి, కుమారుడు సూర్యతేజ రెడ్డి, గణేష్ రెడ్డిలతో బెంగళూరులో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు సూర్యతేజ రెడ్డి బీటెక్ పూర్తి చేయగా.. చిన్న కుమారుడు గణేష్ రెడ్డి బీబీఏ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు సుధాకర్ రెడ్డి మృతితో అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుధాకర్ రెడ్డి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. వీర జవాన్ అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీర జవాన్ అంత్యక్రియలకు గ్రామస్థులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై కన్నీటి వీడ్కోలు తెలుపనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.