AP Assembly: ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక ఆర్డినెన్స్లపై జగన్ సర్కార్ ఫోకస్!
ఒక్కరోజులో 14 ఆర్డినెన్స్లు ఆమోదించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతోంది. దీంతో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.
AP Assembly: ఒక్కరోజులో 14 ఆర్డినెన్స్లు ఆమోదించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతోంది. దీంతో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే ఏపీలో ఇంకా ముఖ్యమైన సమస్యలున్నాయని, వాటిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తే నష్టమేంటని తెలుగు దేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానుంది జగన్ సర్కార్. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఒకేరోజున 14 ఆర్డినెన్స్లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.
ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులెటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్సిటిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్ కార్పోరేషన్ల చట్ట సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణతో పాటు పలు ఆర్డినెన్సులను ఆమోదింపజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీఎల్పీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట సభలను అభాసుపాలు చేస్తోందని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ విమర్శలు చేసింది. అసెంబ్లీ నిర్వహించాలని రాజ్యాంగం గుర్తు చేసిందని, ఆరునెలలకు ఒసారైనా అసెంబ్లీ పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో లేకపోతే అది కూడా పెట్టేవారు కాదన్నారు శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు.