Andhra: పొలంలో నాగలితో దున్నుతుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..

గుంటూరు–మంగళగిరి మార్గంలోని కాజ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా రెండు ప్రాచీన గణపతి విగ్రహాలు, పురాతన మట్టి పాత్రల పెంకులు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి పరిశీలనలో ఇవి శాతవాహనులు–ఆనందగోత్రినుల కాలానికి చెందినవిగా, సుమారు క్రీ.శ. నాలుగో శతాబ్దం నాటి అరుదైన శిల్పాలుగా గుర్తించారు.

Andhra: పొలంలో నాగలితో దున్నుతుండగా.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
Tillage (Representative image )

Edited By:

Updated on: Jul 26, 2026 | 11:38 AM

గుంటూరు–మంగళగిరి ప్రధాన రహదారిపై ఉన్న కాజ గ్రామంలో ప్రాచీన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన వెంకటరామారెడ్డి తన పొలంలోని పాటి దిబ్బను నాగలితో తవ్వుతుండగా రెండు అరుదైన గణపతి విగ్రహాలు, పురాతన మట్టి పాత్రల పెంకులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచిన ఆయన.. ప్లీచ్ ఇండియా అధ్యక్షుడు, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డికి చూపించారు. పరిశీలించిన నాగిరెడ్డి వాటి కాలాన్ని, చారిత్రక విశిష్టతను వివరించారు.

తవ్వకాలలో లభించిన విగ్రహాల్లో ఒకటి సుమారు 3 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉండగా, మరొకటి 2 సెంటీమీటర్ల ఎత్తు, 4 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. ఈ విగ్రహాలను ఎర్ర ఇసుకరాతితో చెక్కినట్లు గుర్తించారు. వీటితో పాటు ఎరుపు, నలుపు, గచ్చకాయ, గోధుమ రంగుల మట్టి పాత్రల పెంకులు కూడా లభించాయి. ఇవన్నీ శాతవాహనులు, ఆనందగోత్రినుల కాలానికి చెందినవిగా ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

లభించిన గణపతి విగ్రహాల్లో గణేశుడు రెండు చేతులతో, ఒక చేతిలో దంతం, మరో చేతిలో మోదకం ధరించి, తలపై కిరీటం లేకుండా సహజసిద్ధమైన ఏనుగు తల, పొడవాటి తొండ, పెద్ద బొజ్జతో లలితాసనంలో ఆసీనుడిగా కనిపిస్తున్నట్లు నాగిరెడ్డి వివరించారు. ఈ ప్రతిమలు పల్నాడు జిల్లా చేజర్లలోని కపోతేశ్వరాలయంలో ఉన్న పాలరాతి గణేశ విగ్రహాన్ని పోలి ఉన్నాయని, అందువల్ల ఇవి క్రీ.శ. నాలుగో శతాబ్దానికి చెందిన ఆనందగోత్రినుల కాలం నాటివిగా భావిస్తున్నట్లు చెప్పారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ విగ్రహాలు, పురావస్తువులను అత్యంత జాగ్రత్తగా సంరక్షించాలని వెంకటరామారెడ్డికి ఈమని శివనాగిరెడ్డి సూచించారు.

Ancient Ganesha Idols

 

 కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ 

Loading...
Unable to load recommendations.
Follow Us