
సొంతింటి కల నెరవేరబోతుందనే ఆనందంలో ఉన్న ఓ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. కొత్తగా నిర్మించిన ఇంట్లో ఇంకా గృహప్రవేశమే జరగలేదు… కానీ ఆ ఇంటి ప్రాంగణంలో అర్ధరాత్రి ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది. ఇంటి ముందు బొగ్గుతో ముగ్గులు, పసుపు, కుంకుమ, రక్తపు ఆనవాళ్లు, వెలిగించిన దీపం కనిపించడంతో యజమాని ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో క్షుద్ర పూజల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన దాసరి రామదాసు ఎంతో కాలంగా కలలుగన్న సొంత ఇంటిని ఇటీవల నిర్మించుకున్నాడు. అయితే ఇంటి నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో గృహప్రవేశం చేయలేదు. ఇంతలోనే రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశించి క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గుర్తించారు. బొగ్గుతో ప్రత్యేకంగా ముగ్గులు వేసి, వాటిపై పసుపు, కుంకుమతో పాటు రక్తం వంటి ద్రవాన్ని చల్లి, దీపం వెలిగించిన ఆనవాళ్లు కనిపించాయి.
ఉదయం ఇంటి వద్దకు వెళ్లిన యజమాని రామదాసు ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు. శుభకార్యానికి సిద్ధమవుతున్న సమయంలో… గృహప్రవేశానికి ముందే ఇలా ఎవరో ఇంట్లోకి ప్రవేశించి క్షుద్ర పూజలు చేయడం ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఆనందంలో ఉండగా ఈ ఘటన జరగడంతో రామదాసు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎవరు ఈ పని చేశారు? ఎందుకు చేశారు? అనే అనుమానాలు ఇప్పుడు కుటుంబ సభ్యులను వెంటాడుతున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి… ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు రామదాసు కోరుతున్నాడు. అయితే ఈ క్షుద్ర పూజల వెనుక ఎవరున్నారు? వారి ఉద్దేశం ఏంటి? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.