
కోనసీమ మత్స్యకారులు సముద్రంలో గల్లెంతై పది రోజులు కావడంతో తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రాణాలతో తిరిగొస్తారన్న నమ్మకం సడలుతున్న తరుణంలో, అసలు నడి సముద్రంలో ఏం జరిగింది? ఆ బోటు ఆచూకీ ఎక్కడనే ప్రశ్న అందరినీ కలచివేస్తోంది. ఇంకా ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. నాలుగు షిప్పులతో కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన బోటు ఈ నెల 3న సముద్రంలోకి చేపల ఏటకి వెళ్లింది. 12వ తేదీన వెనక్కు తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు.. ఈ బోటులో కోపనాతి రామకృష్ణ, సంఘాని తాతారావు, పాలెపు పాపారావు, కొల్లాటి శ్రీనుతో పాటు మరో ముగ్గురు మత్స్యకారులు ఉన్నట్లు వాళ్ల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, బయలుదేరిన గంటకే ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోవడం, రావాల్సిన టైంకి కూడా బోటు వెనక్కి రాకపోవడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది.
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. ఈ బోటు విశాఖపట్నం, పారాదీప్ తీరాల వైపు వెళ్లి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. బోటు ఎక్కడుందో కనిపెట్టేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో మాట్లాడి, వెంటనే రంగంలోకి దిగాలని ఇండియన్ కోస్ట్గార్డ్ను కోరినట్లు వెల్లడించారు. బోటు ఓనర్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకుని రెస్క్యూ టీమ్స్కి అందజేశారు.
ప్రస్తుతం మెరైన్ పోలీసులు, ఫిషరీస్ ఆఫీసర్లు కలిసి గాలింపు చర్యలను స్పీడప్ చేశారు. 15 రోజులకు సరిపడా రేషన్, డీజిల్తో వెళ్లిన బోటు కనిపించకుండా పోవడంతో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన మొదలైంది. మత్స్యకారులంతా సేఫ్గా ఇంటికి రావాలని వాళ్ల కుటుంబ సభ్యులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అధికారులు కూడా అన్ని కోణాల్లోనూ వెతుకులాట కొనసాగిస్తున్నారు.
టూనా చేపల కోసం డీప్ సీ లోకి వెళ్తున్నట్టు చెప్పారని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో ఆ దిశగా గాలింపు చర్యలను చేపట్టనున్నారు. ఇవాళ.. నేవీ హెలికాప్టర్లతో గాలింపు చేపట్టేందుకు కోస్ట్ గార్డ్ పోలీసులు సిద్ధమవుతున్నారు.