రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఎందుకంటే?
శుక్రవారం (మార్చ్ 27వ తేదీ) ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఖరారైంది. కరోనా ఎఫెక్టు నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో జగన్ మంత్రి వర్గం భేటీ కాబోతోంది.
AP Cabinet meeting on friday: శుక్రవారం (మార్చ్ 27వ తేదీ) ఉదయం 11 గంటలకు ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఖరారైంది. కరోనా ఎఫెక్టు నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో జగన్ మంత్రి వర్గం భేటీ కాబోతోంది. అయితే ఇది కరోనా ప్రభావాన్ని సమీక్షించేందుకు మాత్రమే కాదు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు జగన్ మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
నిజానికి మార్చ్ 31లోగా ఏపీ బడ్జెట్ను ఆమోదించాల్సిన పరిస్థితి కానీ.. తాజాగా కరోనా దేశంలోని అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కానీ.. మార్చ్ 31వ తేదీలోగా బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఆ మర్నాటి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్వహణకు నిధుల కొరత ఏర్పడే అవకాశం వుంది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపచేసుకునే పరిస్థితి లేకపోవడంతో.. ప్రత్నామ్నాయ మార్గాన్ని ఆశ్రయిస్తోంది జగన్ ప్రభుత్వం.
శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. వచ్చే మూడు నెలల బడ్జెట్కు ఆమోదానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం వుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30 వరకు అవసరమైన నిధుల వినియోగానికి ఆర్డినెన్స్ జారీకి శుక్రవారం భేటీలో జగన్ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది.