
అమెరికా-ఇరాన్ యుద్దం మళ్లీ మొదలైంది. కొద్ది రోజుల క్రితమే ఇరు దేశాలు శాంతి ఒప్పందం చేసుకోగా.. అది మున్నాళ్ల మచ్చగానే మిగిలిపోయింది. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి రెండు దేశాలు మళ్లీ వార్కు దిగాయి. నాలుగు రోజులుగా భీకర దాడులు చేసుకుంటుండటంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్పై దాడులు ప్రారంభించింది. దీంతో ఇరాన్ రంగంలోకి దిగి బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై క్షిపణులతో దాడులు చేపట్టింది.
“అనధికారిక మార్గంలో” ప్రయాణిస్తోందంటూ ఒక నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. తమ మార్గాన్ని సరిదిద్దుకుని ఆమోదించబడిన మార్గంలో ప్రయాణించాలన్న తమ హెచ్చరికలను, సూచనలను కొన్ని నౌకలు ధిక్కరించాయని ఇరాన్ తెలిపింది. ఈ సంఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ముగిసే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తాము, ఏ నౌకలను కూడా దాని గుండా వెళ్ళడానికి అనుమతించని ఇరాన్ ప్రకటించింది. ఎలాంటి ప్రతీకార చర్యకైనా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులను ప్రారంభించింది. హోర్ముజ్ మూసివేశాక అమెరికా 140 ఇరాన్ లక్ష్యాలపై దాడి చేయగా.. యూఏఈ, ఖతార్లపై ఇరాన్ దాడి చేసింది.
వాణిజ్య నౌకలపై గతంలో జరిగిన దాడుల తర్వాత అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉంటామని నిరూపించుకోవడానికి ఇరాన్కు మరో అవకాశం కల్పించినప్పటికీ, అది మళ్లీ విఫలమైందని అమెరికా చెబుతోంది. దీనికి ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని నిరంతరం బలహీనపరుస్తూ ఉంటామంది. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీరప్రాంత నిఘా స్థానాలపై అమెరికా దాడులు చేపడుతోంది. ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని మీడియా, దేశ దక్షిణ తీరప్రాంతంలోని బుషెహర్, అసలూయే వంటి ఇంధన, పెట్రోకెమికల్ కేంద్రాలపై పేలుళ్లు జరిపింది. ఇక దీనికి ప్రతిస్పందనగా.. గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేపడుతోంది. దీంతో ఈ యుద్దం తారాస్థాయికి చేరుకుంటుండగా.. మరోవైపు శాంతికి చర్చలు జరుగుతున్నాయి. యుద్దం మళ్లీ మొదలవ్వడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇదే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.