ఇరాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్‌ ప్రధానిపై మండిపడుతున్న సొంత దేశస్థులు! కారణం ఏంటంటే..?

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా భారీ నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన కుమారుని వివాహం వాయిదా పడిందని, కుటుంబం నష్టపోయిందని వెల్లడించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల కలిగే సామూహిక బాధను వ్యక్తిగత బాధతో పోల్చడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇరాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్‌ ప్రధానిపై మండిపడుతున్న సొంత దేశస్థులు! కారణం ఏంటంటే..?
Netanyahu

Updated on: Jun 20, 2025 | 11:19 AM

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య వారం రోజుల నుంచి భీకర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరు దేశాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఇరు దేశాలు కూడా యుద్ధం చేయడానికే ఆసక్తి చూపిస్తున్నాయి కానీ, శాంతి చర్చలకు ఎవరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేసుకుంటుందనే అనుమానంతో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఇరాన్‌ ప్రతి దాడులు ప్రారంభించింది. ప్రపంచ దేశాలు శాంతి చర్చలు జరపాలని పిలుపు ఇస్తున్నప్పటికీ ఇరు దేశాలు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

అదేంటంటే.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుపై ఆ దేశంలోని ఎక్కువ శాతం మంది ఇప్పుడు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం సమయంలో నెతన్యాహుకు, అతని పార్టీకి మద్దతు పలికిన వారు కూడా ఇప్పుడు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఇందుకు కారణం ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇరాన్‌ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌లోని సోరోకా ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతింది. ఈ హాస్పిటల్‌ను సందర్శించేందుకు ప్రధాని నెతన్యాహు వెళ్లారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, వ్యక్తిగతంగా తన కుటుంబం కూడా నష్టపోయిందంటూ పేర్కొన్నారు.

ఈ యుద్ధం కారణంగా తన కుమారుడు అవ్నర్ నెతన్యాహు వివాహం వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. ఇది తన కుమారుడికి కాబోయే భార్యకు, అలాగే తన భార్యకు తీవ్రంగా బాధించే అంశమన్నారు. ఇంతటి బాధను భరిస్తున్న తన భార్య సారా నెతన్యాహు హీరో అంటూ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. ఇదే ఇప్పుడు ఇజ్రాయెల్‌ పౌరులకు కోపం తెప్పిస్తుంది. ఇక పక్క యుద్ధం కారణంగా అనేక కుటుంబాలు తమ సభ్యులను కోల్పోవడం, మీ కుటుంబం పెళ్లి వాయిదా వేసుకోవడం ఒక్కటేనా? ఇది వ్యక్తిగత నష్టమా? అంటూ నెతన్యాహుపై సోషల్‌ మీడియా వేదికగా ఇజ్రాయెల్‌ పౌరులు మండిపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి